
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ సంతోషిమాత, నవగ్రహ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా కార్యక్రమం శనివారం కన్నుల పండువగా ప్రారంభించారు. మండలపూజ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం గణపతి హోమము మరియు స్వామి వారికి విశేష అభిషేకాలు మరియు ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి మహాదివ్య పడిపూజ నిర్వహించారు. స్వాముల శరణు ఘోషతో, పేటతుల్లుతో ఆలయం మార్మోగింది. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులు మరియు అయ్యప్పలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి దేవాలయం పూజారులు, హుజురాబాద్ పాలకవర్గ సభ్యులు, గురు స్వాములు, అయ్యప్ప భక్తులు, అభిమానులు పాల్గొన్నారు.








