
_జగపతిరావు విగ్రహం ఏర్పాటుకు 20 గుంటల స్థలం కేటాయించాలి..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ నవంబర్ 17 : సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మార్క్ ఫెడ్ చైర్మన్ గా పని చేసి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన, కరీంనగర్ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేసిన ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత నాయకుడు వెలిచాల జగపతిరావు పేరును కరీంనగర్ లోని మానేరు రివర్ ఫ్రంట్ కు పెట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ వై సునీల్ రావుతో పాటు పలువురు ముఖ్య నేతలకు వెలిచాల సాధన సమితి కన్వీనర్ సరిల్ల రతన్ రాజు, కో కన్వీనర్ గండి రాజేశ్వర్, అడ్వైజర్లు దర్శనాల నారాయణ, ఎండి ఖషిద్, పులి నరసింహారావు డైరెక్టర్ చిందం శ్రీనివాస్ వినతి పత్రాలు అందజేశారు. తిమ్మాపూర్ లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు, కరీంనగర్ లో గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుకు వినతి పత్రాలు అందజేశారు. జగపతిరావు అందించిన సేవలకు గానూ మానేరు రివర్ ఫ్రంట్ కు ఆయన పేరు పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కరీంనగర్ నగర పరిధిలో జగపతిరావు విగ్రహం ఏర్పాటు చేసేందుకు 20 గుంటల స్థలాన్ని కేటాయించాలని కోరారు. జగపతిరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారని, పేదల సంక్షేమం కోసం నిరంతరం పరితపించారని పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధిలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు 20 గుంటల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో జగపతిరావు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారని వివరించారు. మార్క్ ఫెడ్ చైర్మన్ గా రైతుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేశారని, వారి అభ్యున్నతికి అనేక విప్లవాత్మక కార్యక్రమాలను రూపొందించి అమలు చేసిన ఘనత జగపతి రావుకే దక్కుతుందని పేర్కొన్నారు. జగపతిరావు 1972 నుంచి 1977 వరకు జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, 1978 నుంచి 1984 వరకు ఎమ్మెల్సీగా, 1989 నుంచి 1994 వరకు కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేశారని తెలిపారు. జగపతిరావు కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నేత, డైనమిక్ లీడర్ అని పేర్కొన్నారు. అనేక బృహత్తరమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, కరీంనగర్ ప్రజలు ఆయనను ప్రజాబంధు అని పేరు గడించారని గుర్తు చేశారు. అదేవిధంగా మాజీ మేయర్ డి. శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఆకారపు భాస్కర్ రెడ్డికి కూడా వెలిచాల సాధన సమితి ప్రతినిధులు వినతిపత్రాలు అందజేశారు. వారు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
