
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ (వీణవంక)నవంబర్ 25: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పరిధిలో గల కల్వల ప్రాజెక్ట్ లో సాగునీటి కోసం సోమవారం వీణవంక రైతులు సొంత ఖర్చులతో మరమ్మత్తు పనులు చేపట్టారు. రైతుల వరప్రసాదంగా పేరుగాంచిన కల్వల ప్రాజెక్ట్ గత సంవత్సరం వర్షాకాలంలో వరద ఉధృతి పెరిగిపోయి ముత్తడి తెగిపోవడంతో, కలువల ప్రాజెక్ట్ ఆధారిత రైతులకు ప్రతి పసల్ కు, రైతులు సొంత ఖర్చులతో మరమ్మత్తులు చేపట్టడం తప్పడం లేదు. కల్వల ప్రాజెక్టు అనుకొని ఉన్న గ్రామాలైన కాచాపూర్, గద్దపాక గ్రామాల రైతులు లిఫ్ట్ ల ద్వారా కిలోమీటర్ దూరంలో ఉన్న పంట పొలాలకు సాగునీటిని పైప్ లైన్ ద్వారా వాడుకుంటున్నారు. అలాగే కల్వల ప్రాజెక్ట్ మత్తడి దిగున వాగుగా ఏర్పడి, మల్లన్న పల్లి, బ్రాహ్మణపల్లి, కల్వల, వీణవంక, రెడ్డిపల్లి, రామకృష్ణాపూర్, లస్ముక్కపల్లి , పోతిరెడ్డిపల్లి గ్రామాల గుండా ప్రవహించి, విలాసాగర్ వద్ద మానేరులో కలుస్తూ, అన్నదాతల ఆశాదీపంగా, సాగునీటికి కొండంత అండగా, నైలునది వరప్రసాదంగా తలపిస్తూ, వేసవిలో సైతం చెక్ డ్యాములు నిండికుండలా తలపిస్తూ, రైతులకు రెండు పంటలకు డోకా లేకుండా పుష్కలంగా సాగునీరు ఉండడంతో రైతు సోదరులు తమ పంట పొలాలలో ఆడ, మగ వరి పంటలు పండిస్తూ, ఆర్థికంగా నిలదొక్కుకునే సమయంలోనే, కలువల ప్రాజెక్టుకు గండి పడగానే, అన్నదాతల ఆశలు అడియాశలు అయ్యాయి. ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెగిపోయిన సమయంలో ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ప్రస్తుత మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తదితర పార్టీ నాయకులు, జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులు గండిని పరిశీలించిన, ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో కల్వల ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపట్టక పోవడం వల్లే, రైతులు ముందుకు వచ్చి సొంత ఖర్చులతో మరమ్మత్తులు చేపడుతూ, సాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బాధలను ఆలోచించి తాత్కాలిక పద్ధతుల సాగునీరు అందిస్తూ, శాశ్వత మరమ్మతుకు ప్రణాళికలు వేసి, మరమ్మత్తులు ప్రారంభించాలని, రైతు సోదరులు వేడుకుంటున్నారు.
