
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వెలమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అమర్యాద వ్యాఖ్యలు ఒక ప్రజాప్రతినిధి స్థాయికి తగదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రైతు, ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. ఇలాంటి వైఖరిని ముఖ్యమంత్రి కూడా స్పందించాలని కోరారు. శనివారం కరీంనగర్ లోని ప్రెస్భవన్లో నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలతో ఓసీల మనోభావాలు దెబ్బతిన్నాయని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశామని తెలిపారు. కులం పేరుతో దూషిస్తే ఎస్సీ, ఎస్టీ వర్గీయులకు వర్తింపజేసే అట్రాసిటీ చట్టాన్ని, ఇతర అన్ని కులాలకు కూడా అదేవిధంగా వర్తింపజేసి సామాజిక సమన్యాయం జరపాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు కొత్తకొండ రవీందర్రావు, పెండ్యాల రాంరెడ్డి, తీగల లక్ష్మణరావు, అండెం రమణారెడ్డి, జిల్లాల అంజయ్య, శ్రీరాంభట్ల దీపకాబాబు, జనగామ చంద్రశేఖర రావు, తదితరులు పాల్గొన్నారు.


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పోలాడి రామారావు





