
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సంస్కరణల శిల్పి, స్థిత ప్రజ్ఞ, బహుభాషా కోవిదుడు, రచయిత ,దేశానికి దిక్సూచి, మార్గదర్శి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారత నిర్మాత, తెలంగాణా ముద్దు బిడ్డ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. సోమవారం సమాఖ్య కార్యాలయంలో ఎర్పాటు చేసిన జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమంలో పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా పీవీ చిత్రపటానికి రైతు నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళలర్పించారు. పీవీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ పగ్గాలు చేపట్టిన పీవీ చేపట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా అణుశక్తి, విదేశాంగ విధానం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతర్గత భద్రతలో ఎంతో ప్రగతి సాధించిందని కొనియాడారు. వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను పెంచిన పీవీ స్ఫూర్తి ప్రస్తుత పాలకులు ఆచరించాలని పోలాడి రామారావు అన్నారు. అనంతరం నిర్వహించిన రైతు దినోత్సవ కార్యక్రమంలో పోలాడి రామారావు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను రైతులు అంది పుచ్చుకుంటూ వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని అన్నారు. మూస పద్ధతుల ద్వారా చేస్తున్న వ్యవసాయం అధిక నష్టాలను, ఆత్మహత్యలకు కారణం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సేంద్రియ ఆర్గానిక్ వ్యవసాయం చేసి విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించాలని, రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి, గిట్టుబాటు ధర కల్పించి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని రామారావు కోరారు. వ్యవసాయ శాఖల అధికారులు ప్రతి పంట సాగు సమయంలో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సూచనలు, సలహాలు అందించాలన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను విరివిగా ఏర్పాటు చేసి రైతులు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలను కోరారు.
వరిపంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్, కంది, పెసరు, మిర్చి, వేరుశెనగ, మొక్కజొన్న, డ్రాగన్ ఫ్రూట్స్ లాంటి పంటలను ప్రోత్సహించి, వాటికి కనీస మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. రైతులు తమ వ్యవసాయ భూముల్లో పంటలు వేసుకునే నిర్ణయాధికారాన్ని రైతుల అభీష్టానికే వదిలి వేయాలన్నారు. అయితే ప్రత్యామ్నాయ పంటలు, సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మల్లాల్సిన అవసరం వుందని ఇందుకు ప్రభుత్వాలు ప్రోత్సహించాలని అన్నారు. రైతులకు కల్పిస్తున్న భీమా వయోపరిమితిని 59 సం. ల నుంచి 69 సంవత్సరాల వరకు పెంచి సడలించాలని,50 సం. లు నిండిన రైతులందరికి నెలకు రూ.5 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులు అందించాలని, పేద రైతు కుటుంబాల్లోని విద్యార్థులకు విదేశే విద్యకు 25 లక్షల రూపాయలు ఆర్తిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
అర్థిక స్థితి గతుల ఆధారంగా రైతులకు 80 శాతం రాయితీతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందజేయాలన్నారు. రైతుల వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధించాలని, పంటల ఫసల్ భీమా పథకాన్ని గ్రామాన్ని యూనిట్ గా పరిగణించి అమలు చేయాలని, పంటల ఉత్పత్తులను గిట్టుబాటు ధరతో వెనువెంటనే ప్రభుత్వాలే నేరుగా కొనుగోళ్లు చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి మాట్లాడుతూ సరైన సమయంలో విత్తనాలు వేసుకోవడం, సమగ్ర నీటి యాజమాన్య, పోషక పద్ధతులు, పంటల మార్పిడి, అంతరపంటల సాగు, రసాయన ఎరువులు, పురుగుల మందు వాడకం తగ్గించేలా ప్రభుత్వాలు రైతులను చైతన్య పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నర్సింహ్మారెడ్డి, నాయకులు కంకణాల సరోజన జనార్థన్ రెడ్డి, విజయారెడ్డి, తాటిపల్లి రాజన్న, విష్ణుదాస్ గోపాల్ రావు, ముచ్ఛా సమ్మిరెడ్డి, లక్ష్మణమూర్తి, కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
