
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: భూరికార్డుల్లో అధికారులు తప్పులు చేస్తే వారి ఉద్యోగం ఊడనుంది. ఈ మేరకు కొత్తగా తేనున్న భూభారతి చట్టంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టింది. ఇటీవల అసెంబ్లీ, శాసనమండలిలో ఆమోదం పొందిన భూభారతి బిల్లును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. గవర్నర్ ఆమోదించిన తర్వాత అది చట్టంగా మారనుంది. కొందరు అధికారుల తీరుతో భూరికార్డుల్లో తప్పులు జరుగుతున్నాయి. లంచాలకు ఆశపడడం, ప్రభుత్వంలోని పెద్దల మాటలు వినడం, వాళ్ల బెదిరింపులకు లొంగడం, ఇతర కారణాలతో కొందరు అధికారులు భూరికార్డులను సవరిస్తున్నారు. ఈ క్రమంలోనే భూవివాదాలు పెరుగుతున్నాయి. అయితే కొత్త భూభారతి చట్టంతో ఇలాంటి వాటికి పూర్తిగా చెక్పడనుంది. రెవెన్యూ ఉద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ, ఈ విషయంలో ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల వివరాలను తప్పుగా నమోదు చేస్తే, సదరు అధికారులపై క్రిమినల్కేసులు కూడా నమోదు చేయనుంది. ఏ అధికారి స్థాయిలో తప్పు జరిగితే ఆ అధికారిపైనే చర్యలు తీసుకోనుంది. ఒకవేళ అధికారులందరూ తప్పు చేసినట్టు నిర్ధారణ అయితే, వాళ్లందరిపై చర్యలు తీసుకోవడంతో పాటు సర్వీస్నుంచి తొలగించనుంది. ఇందుకు ఐఏఎస్ఆఫీసర్లు కూడా అతీతులు కాదని సెక్రటేరియెట్ వర్గాలు వెల్లడించాయి.
గ్రామానికో అధికారి..
వీఆర్వోలు అవినీతికి పాల్పడుతున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. అలాగే వీఆర్ఏ వ్యవస్థను కూడా తొలగించింది. వీఆర్వోలు, వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామానికో అధికారిని నియమించనుంది. దాదాపు 11 వేల మందిని గ్రామ స్థాయి అధికారులుగా తీసుకోనున్నట్టు తెలిసింది. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏగా పని చేసినోళ్లను గ్రామ స్థాయి అధికారులుగా తీసుకోనుంది. ఇందుకు సంబంధించి సీసీఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్సెక్రటరీ నవీన్మిట్టల్ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారు. మొత్తం 11 వేల మందిలో సగం మందిని గతంలో వీఆర్వోలు, వీఆర్ఏగా పని చేసినోళ్లను తీసుకోవాలని.. మిగతా సగం మందిని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా నియమించాలని సర్కార్ ఆలోచన చేస్తున్నది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.






