
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:విద్య వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏబీవీపీ కరీంనగర్ విభాగ్ కన్వీనర్ అజయ్ పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుజురాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.అనంతరం విభాగ్ కన్వీనర్ అజయ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో విద్యవ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అలాగే కొనసాగించి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ అజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆర్థిక సామాజిక అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నేడు పాలకుల స్వార్థపూరిత ఆలోచనల వల్ల ఆర్థిక సంక్షోభంతో సతమత మవుతుందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ హాస్టల్లు సమస్యల కుంపటిలా మారాయని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా…. ఏబీవీపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు.అలాగే సిద్దిపేట పట్టణంలో ఈనెల 23, 24, 25వ తేదీలలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో విద్యా రంగ సమస్యలపై ఆమోదించిన తీర్మానాలను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో విద్యకు 14 శాతం నిధులు కేటాయిస్తే, తెలంగాణలో విద్యకు 7 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రయివేటు యూనివర్సిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. ఈ సమావేశంలో కరీంనగర్ విభాగ్ కన్వీనర్ అజయ్ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోసుకుల అజయ్, టౌన్ హాస్టల్ కన్వీనర్ అభిలాష్ , కో కన్వీనర్ జస్వంత్, విజయ్, హరీష్, భరత్, రంజిత్, బిట్టు తదితరులు పాల్గొన్నారు.







