
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు దేశానికి తీరని లోటని,మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా, మాజీ ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు దేశం ఏ నాటికి మరిచిపోదనీ జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రధానిగా అనేక గొప్ప చట్టాలను తీసుకొచ్చి పెనుమార్పులు చేశారని, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, లోక్ పాల్ బిల్లు, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక చట్టాలను అమలు చేసిన ఘనత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కే దక్కుతుందని నాయకులు పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారు పేరు, నమ్మిన సిద్ధాంతం జీవితకాలం ఆచరించిన గొప్ప మనిషి మన్మోహన్ సింగ్ అని, ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. దేశం ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితల్లో ఉన్నప్పుడు తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన మహనీయులు మన్మోహన్ సింగ్ ని ఆయన అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి జమ్మికుంట కాంగ్రెస్ పట్టణ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ నాయకులు కాసుబోసుల వెంకన్న, ఎక్స్ ఎంపిటిసి బాసాల రామస్వామి, అయోధ్య, ఎండి సలీం పాషా, ఇమ్రాన్, రాజమౌళి, ప్రభుదాస్, పోతుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.







