
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామ శివారులో పెద్దగుట్ట సమీపంలో గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనదారున్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి ఎక్కడికి దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సింగపూర్ గ్రామ శివారులో పెద్దగుట్ట సమీపంలో కరీంనగర్ -వరంగల్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హుజురాబాద్ మండలం మాందాడిపల్లి గ్రామానికి చెందిన మామిడాల రవీందర్ రెడ్డి (53) అనే వ్యక్తి శరీరం పై నుండి భారీ వాహనం వెళ్లడంతో శరీరం నుజ్జు నుజ్జు అయి ఆక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. అయితే మృతుడు రవీందర్ రెడ్డి తన పొలంలో కూరగాయల నారు అలికేందుకు మానకొండూరు సమీపంలోని నర్సరీకి వెళ్లి కూరగాయల నారు సంచిలో వేసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా మరికొద్ది దూరంలో ఇల్లు వస్తుందనే క్రమంలోనే గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి తీవ్రగాయాలతో మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు టౌన్ సిఐ జి తిరుమల గౌడ్ తెలిపారు.




రోడ్డు ప్రమాదం జరిగిన దృశ్యాలు..

మృతుడు రవీందర్ రెడ్డి (ఫైల్ ఫోటో)





