
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హైదరాబాద్లో మహిళా న్యాయమూర్తిపై ఓ నేరస్థుడు బహిరంగ కోర్టులో దాడి చేయడాన్ని హుజురాబాద్ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. అందుకు నిరసనగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం విధులను బహిష్కరించారు. గురువారం కేసు విచారణ జరుపుతున్న ఎల్ బి నగర్ సెషన్స్ జడ్జిపై నిందితుడు చేసిన దాడిని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. కరడుగట్టిన నేరస్తుల కేసులు నిత్యం విచారించే జ్యుడీషియల్ అధికారుల భద్రత కోసం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి గురైన మహిళా న్యాయమూర్తి ఇటీవలే హత్యాయత్నం కేసులో ఆ నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అదే వ్యక్తి యొక్క ఇతర క్రిమినల్ కేసును విచారిస్తున్నప్పుడు, ముద్దాయి ఆకస్మాత్తుగా బహిరంగ కోర్టులో ఆ మహిళా జడ్జిపై దాడి చేసి, అతనిని శిక్షించినందుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని న్యాయమూర్తిని మరియు ఆమె కుటుంబ సభ్యులను బెదిరించడం చాలా అమానుషమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి మట్టెల తిరుపతి, న్యాయవాదులు ముక్కెర రాజు, మంచికట్ల శ్రీనివాస్, భానుకిరణ్, గోపు సమ్మిరెడ్డి,ఆకుల శ్రీనివాస్, కేశబోయిన అశోక్, పిట్టల రాజేశ్, రాజు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
