
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చేల్పూర్ గ్రామపంచాయతీకి చెందిన బండారి రమ్య (14) తీవ్ర జ్వరంతో ఆసుపత్రికి తరలించే లోపే ఆకస్మికంగా మృత్యువాత పడింది. చెల్పూర్ కు చెందిన బండారి పెద్ద రమేష్ జమ్మికుంటలో ఓ వ్యక్తి వద్ద టాటా సుమో వాహన డ్రైవర్ గా జీతం ఉండి కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతనికి భార్య సంపూర్ణ, ఇద్దరు కుమార్తెలు కలరు. పెద్ద కూతురు ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతుండగా చిన్న కూతురు రమ్య గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. 20 రోజుల క్రితం బండారి రమ్య జ్వరంతో బాధపడుతుండగా హనుమకొండలోని ఓ ప్రైవేట్ దావాఖానలో చూపించి మందులు వాడగా కొంత తగ్గడంతో ఇంటికి తీసుకువచ్చారు. మళ్లీ వారం రోజుల క్రితం జ్వరం రాగా స్థానిక వైద్యునికి చూపించి మందులు వాడుతుండగా రాత్రి తీవ్రంగా జ్వరం రావడంతో ఉదయం మళ్లీ ఈ దవాఖానకు తీసుకువెళ్దామని సిద్ధమయ్యే క్రమంలో ఒక్కసారిగా రమ్య మృత్యువాత పడింది. చిన్న కూతురు అనారోగ్యంతో ఈ రోజు పొద్దున మృతి చెందడంతో పెద్ద కూతురు ప్రత్యూష, భార్య సంపూర్ణ, రమేష్ లు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. రెక్క ఆడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి పేదరికంతో సరైన వైద్యం సకాలంలో చేయించలేక రమ్య మృతి చెందిందని గ్రామస్తులు తీవ్రంగా కలత చెందారు. దాతలు గాని ప్రభుత్వం గాని ముందుకు వచ్చి నిరుపేద రమేష్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన రమ్య..