Oplus_131072
–హనుమకొండలో రెండు జిల్లాల కార్యవర్గ సమావేశం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కోసం పోరాడుతామని టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ఉద్ఘాటించారు. శనివారం హనుమకొండ బాల సముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో హనుమకొండ, వరంగల్ జిల్లాల టీయూడబ్ల్యూజేే జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. హనుమకొండ జిల్లా అధ్యక్షులు, సాక్షి ఉమ్మడి వరంగల్ బ్యూరో ఇన్చార్జి గడ్డం రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విరాహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ల విషయములో కొందరు చేస్తున్న దుష్ర్పచారాన్ని నమ్మవద్దని అన్నారు. డెస్క్ జర్నలిస్టులతో సహా అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ అందే విదంగా టీయూడబ్ల్యూజేే కృషి చేస్తుందని అన్నారు. నేడు అక్రిడిటేషన్ లు అంగట్లో సరుకుగా మారాయని, గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారముగా అక్రిడిటేషన్ నిబంధనలు పెట్టి చిన్న పత్రికలను ఏబీసీడీలుగా వర్గీకరించారని, బాషా ప్రాతిపదిక నిబంధనతో ఉర్దూ పత్రికలకు అన్యాయం చేస్తే కోర్టుకు వెళ్లి ఆ నిబంధనలను తొలగించామని అన్నారు. అలాగే జర్నలిస్టులకు ఆరోగ్య పథకం కావాలని, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజేే పోరాడుతున్నదని, ఇటీవలే ఆర్థికశాఖ, ఆరోగ్య శాఖ మంత్రులను కలిసి విన్నవించడం జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా జేహెచ్ఎస్ ప్రారంభించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారని అన్నారు. ఇప్పటికే ప్రెస్ అకాడమీ ద్వారా మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయలతో పాటు జర్నలిస్టు భార్యకు ఐదేళ్ల పాటు నెలకు రూ. 3వేల పెన్షన్ అందించడం జరుగుతున్నదని, జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణ కోసం టీయూడబ్ల్యూజేే కృషి చేస్తూనే వాటి కుటుంబాలను ఆదుకునేందుకు టీయూడబ్ల్యూజేే కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడే సంఘం టీయూడబ్ల్యూజేే మాత్రమేనని, ఏ ప్రభుత్వానికి భజన చేయలేదు కనుకనే డెబ్బై ఏండ్లుగా టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) రాష్ట్రంలో మొనగాడు సంఘంగా జర్నలిస్టుల గుండెల్లో నిలిందని అన్నారు. డెస్క్ జర్నలిస్టులతో సహా జర్నలిస్టుల అక్రిడిటేషన్ లపై ఇతరులు చేస్తున్న గ్లోబెల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ మాట్లాడుతూ జిల్లాల్లో నిర్మాణ పరంగా టీయూడబ్ల్యూజేే ను పటిష్ఠం చేయాలని సూచించారు. హైదరాబాద్ తరువాత వరంగల్, హనుమకొండ జిల్లా కేంద్రాలు కీలకమైనవి అని, నిరంతరం జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతూ సంఘం ప్రతిష్టను పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ లు అర్హులైన వారందరికీ అందేలా పోరాడాలన్నారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజేే రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపల్లి మధు, సీనియర్ నాయకులు దాసరి క్రిష్ణారెడ్డి, వరంగల్ జిల్లా అద్యక్షులు ఎం. రాంచందర్, హనుమకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు తోట సుధాకర్, మట్టా దుర్గాప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకనాల సంతోష్, పి వేణుమాధవ్, ప్రెస్ క్లబ్ అద్యక్ష, కార్యదర్శలు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం రజనీకాంత్, గుంటి విద్యాసాగర్, రెండు జిల్లాల ఆఫీసు బేరర్లు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.







