
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఎండల తీవ్రత దృష్ట్యా పంటలు ఎండి పోతున్న రైతులకు మరో మూడు వారాల పాటు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించాలని ఇందుకు నీటిపారుదల అధికారులు కెనాల్ వెంబడి నిరంతర పర్యవేక్షణ చేయాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు పోలాడి రామారావు కోరారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట మండలాల పరిధిలోని కాకతీయ కాలువ పరిధిలోని డిబిఎం.4 నుండి డిబిఎం.9 ఉపకాలువల వెంట గురువారం రైతులతో కలిసి పోలాడి రామారావు పర్యటించి రైతుల పొలాలను పరిశీలించారు.
కాలువల వెంట అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో చాలా మంది రైతుల పొలాలకు నీళ్ళు అందక పొట్ట దశలో ఉన్న పైరు ఎండి పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారని రామారావు విచారం వ్యక్తం చేశారు. వీణవంక నుంచి జమ్మికుంట వరకు గల చివరి ఆయకట్టు రైతాంగానికి నీళ్ళు సరిగా అందడం లేదని రైతులు దిగాలు చెందుతున్నారని తన పరిశీలనలో తేలిందని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే కాలువల వెంట నిరంతర పర్యవేక్షణ చేయాలని ఇందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రామారావు డిమాండ్ చేశారు. మరో 3 వారాల పాటు రైతాంగానికి నీళ్ళు అందించి చివరి ఆయకట్టు రైతులు పంటలను కాపాడాలని పోలాడి రామారావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ తీసుకోవాల్సి ఉంటుందన్నారు.




వీణవంక మండల రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్న పోలాడి రామారావు..