
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కుల రహిత సమాజం కోసం పాటు బడిన, తొలి తరం దళిత నేత , సమతావాది, బడుగు బలహీనవర్గాల నేత, దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, సమ సమాజ స్థాపనకై కృషి చేసిన దళిత తొలి దేశ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం 118వ జయంతి సందర్భంగా రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఘనంగా నివాళులు అర్పించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పోలాడి రామారావు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అంతకు ముందు తన స్వగ్రామమైన వన్నారం గ్రామ పంచాయతి కార్యాలయ ఆవరణలో గ్రామ పంచాయతి ఉద్యోగులు, సెక్రటరీ శారద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వచిన జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో రామారావు పాల్గొని జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొలాడి రామారావు మాట్లాడుతూ 50 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా పేరున్న ఆయన నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం అన్నారు.1956 నుంచి 1986 వరకు పార్లమెంట్ సభ్యుడిగా సభ్యుడిగా కొనసాగి 30 ఏళ్లపాటు కేంద్ర మంత్రిగా పనిచేయడం రికార్డుగా నిలిచిందన్నారు.
1977 నుంచి 1979 వరకు ప్రధానిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ హయాంలో ఉప ప్రధానిగా, తొలి దళిత ఉప ప్రధానిగా పని చేసిన జగ్జీవన్ రామ్ రికార్డు సృష్టించారన్నారు. నిర్ణయాల్లో పరిపక్వత , కష్టాల్లో మొక్కవోని ధైర్యం , చర్చల్లో మేధావి తనం వంటి లక్షణాలే జగ్జీవన్ ను విలక్షణ నాయకుణ్ణి గా చేశాయన్నారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకోగల రాజనీతిజ్ఞత, తర్పం, విషయ పరిజ్ఞానం ఆయన సొంతమన్నారు.
దళితులు జనజీవన స్రవంతికి దూరంగా కావడానికి ఇష్టం పడని జగ్జీవన్ సమానత్వం కోసం చివరి వరకు పోరాడిన యోధుడిగా జగ్ జీవన్ చరిత్రలో నిలిచిపోతారని రామారావు నివాళులు అర్పించారు. విద్యార్థి దశనుంచి రాజకీయాల్లో సామాజిక ఉద్యమాలలో పనిచేసిన ఆయన స్వాతంత్ర్య సమర యోధుడిగా పోరాడిన ఆయన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని దళితుల హక్కుల కోసమే అంకితం చేశారన్నారు. అణగారిన కులాలకు ఓటు హక్కు కోసం, కనీస వేతన చట్టం అమలుకు పని చేసిన ఆయన 30 ఏళ్ల పాటు కేంద్ర మంత్రి గా కొనసాగారన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నెహ్రూ మంత్రి వర్గంలో యంగెస్ట్ మినిస్టర్ ఉన్న ఆయన 1971లో భారత పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా సమర్థ వంతంగా పనిచేశారని, వ్యవసాయ మంత్రిగా పనిచేసిన ఆయన హయాంలో దేశంలో హరిత విప్లవం తీసుకు రావడంలో జగ్ జీవన్ రాం కీలక పాత్ర పోషించిచారని రామారావు కొనియాడారు. 1979 లో లోక్ సభ లో అవిశ్వాస తీర్మానం తో ప్రధాని పదవి నుంచి మొరార్జీ దేశాయ్ బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో ఉప ప్రధానిగా ఉన్న జగ్జీవన్ రాం ప్రధాని అవుతారని దేశ ప్రజలందరూ భావించగా తృటిలో ఆ పదవి జగ్జీవన్ చేజారి పోవడం బాదా కరమని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. జగ్ జీవన్ రాం కుమార్తె మీరా కుమార్ లోక్ సభ స్పీకర్ గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర బిల్లును ఆమోదింప జేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా జగ్జీవన్ రామ్ కుటుంబ నిలిచిపోయిందని పోలాడి రామారావు పేర్కొన్నారు. మచ్చలేని నిస్వార్థ నాయకుడిగా సమ సమాజ నిర్మాణానికి పాటు పడిన జగ్జీవన్ రాం నేటి తరం వారు ఆదర్శంగా తీసుకోవాలని రామారావు పిలుపునిచ్చారు.




