
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామంలోని పోచమ్మవాడ వద్ద ఆదివారం తెల్లవారుజామున బహిర్ భూమికి వెళ్లిన ఓ యువకుడి పై ఎలుగుబంటి దాడి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాట్రపల్లి గ్రామానికి చెందిన బాణాల హరీష్,(32) ఉదయం బహిర్భూమికి వెళ్ళగా ఈ ఘటన జరిగింది. ఎలుగుబంటిని గమనించిన హరీష్, సాహసోపేతంగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఎలుగుబంటి అతని భుజంపై దాడి చేసి గాయపరిచింది. దాడిని అడ్డుకునే క్రమంలో అతని రెండు చేతి వేళ్ళు ఫ్రాక్చర్ కావడంతో వెంటనే జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవల కొన్ని రోజులుగా గ్రామంలో ఎలుగుబంటి సంచారం జరుగుతున్నట్లు గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు రెండు సార్లు సమాచారం అందించినా, వారు తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో పిల్లలు బయట ఆడుకునే అవకాశం ఉంది. కాబట్టి దీంతో ఎలుగుబంటి దాడులకు గురయ్యే ప్రమాదం పెరిగినందున, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఎలుగుబంటిని బంధించి వన్యప్రాణి సంరక్షణ అధికారులకు అప్పగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.






ఎలుగుబంటి దాడిలో గాయపడిన హరీష్..





