
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పేదరీకంలో ఉండి పరిస్థుతులు బాగోలేక ఆసుపత్రుల పాలైన వారిని సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరసలో ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 5 మండలాలు, 2 పట్టణాలకు సంబంధించిన 183 లబ్దిదారులకు 76 లక్షల విలువచేసే చెక్కులను లబ్దిదారులకు స్వయంగా ప్రణవ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెక్కులు వచ్చిన వెంటనే లబ్దిదారులకు అందజేస్తున్నామని, వారు వెంటనే బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిననాటినుండి 1,500 కోట్ల పై చిలుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని, అర్హులైన లబ్ధిదారులను ఆదుకోవడంలో రాజకీయాలకతీతంగా ఉంటామని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో పార్టీ కార్యాలయానికి వచ్చిన వెంటనే అధికారులకు పంపించి చెక్కులు త్వరగా వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల స్థానిక శాసనసభ్యుడు నిర్లక్ష్యంతో చాలామందికి చెక్కుల పంపిణీలో ఆలస్యం జరిగిందని కొన్ని చెక్కులు బౌన్స్ కూడా జరిగాయని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్