
– ఎల్కతుర్తి బహిరంగ సభ జనసముద్రం కావాలి
– బహిరంగ సభ కాంగ్రెస్ పతనానికి నాంది
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టిన బహిరంగ సభకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కథానాయకులై కదలి రావాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి సుమారు లక్ష మంది తరలిరావాలని ఆయన అన్నారు. ఎల్కతుర్తి సభ జనసంద్రంగా మారాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి హుజురాబాద్ కంచుకోట అని అన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మంది హాజరై హుజురాబాద్ సత్తా చాటాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వదిలిపెట్టేదే లేదని అన్నారు. హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తనపై కేసులు నమోదు చేస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టిన ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే ప్రజలనుంచి భారీ వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రభుత్వ పట్టణానికి పునాదిరాయి వేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాల పట్ల రాష్ట్ర ప్రజలు విరక్తి చెంది ఉన్నారని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ దే అధికారం అని భీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడూరి ప్రతాపరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



హుజూరాబాద్ మండలంలోని పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..