
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను ప్రమాదాలు కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, అలాంటి ప్రదేశాలలో వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ శ్రీనివాస్ జీ సూచించారు. ఇందులో భాగంగా శుక్రవారం సబ్ డివిజన్ పరిధిలోని ప్రమాద ప్రాంతాలను గుర్తించి అట్టి ప్రదేశాలలో ప్రమాద సూచికలతో పాటు ప్రమాద ప్రాంతాలను గుర్తించే వీలుగా రహదారులపై రేడియమ్ స్టిక్కర్లు అంటించడం జరిగింది.
అదేవిధంగా తుమ్మనపల్లి, కేశవపట్నం గ్రామాలలో పలు రహదారి భద్రతా చర్యలను చేపట్టామని అన్నారు. ప్రమాదాలు సంభవించే ప్రమాద ప్రాంతాలుగా గుర్తించిన చోట్ల వద్ద మోటారు వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, డ్రైవర్లు మరియు సాధారణ ప్రజలకు ప్రమాద సూచనలు ఇవ్వాలన్న ఉద్దేశంతో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మా రహదారి భద్రతా బృందం నిరంతరంగా ఈ ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, తీసుకున్న చర్యల ప్రభావాన్ని గమనిస్తూ ఉంటుందనీ, అవసరమైతే మరిన్ని మెరుగుదల దిశగా చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సిఐ జి తిరుమల్ గౌడ్, రూరల్ సీఐ పీ వెంకట్ గౌడ్ తోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.











