
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ ఏప్రిల్ 25 :’వరంగల్ బారాస బహిరంగ సభ మరోసారి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు చేపట్టిన కార్యక్రమమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సుతారి లక్ష్మన్ బాబు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంధేన వెంకటేష్ విమర్శించారు. వారు మాట్లాడుతూ..ఇక 2014 మరియు 2018 ఎన్నికల్లో తెరాస పార్టీ ఎన్నో హామీలను గుమ్మరించి ప్రజల నమ్మకాన్ని పొందిందని, అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రధాన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, నిరుద్యోగ సమస్య పరిష్కారం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి అంశాల్లో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తామని చెప్పి, చివరికి ఆ హామీని వదిలేసి దళితుల ఆశలపై నీరు చల్లిందని విమర్శించారు. తెరాస పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో హామీలు ఎందుకు అమలు చేయలేకపోయారో ఇంట్రస్పెక్షన్ (ఆత్మ పరిశీలన) చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని, ఇచ్చిన హామీల అమలుపై పూర్తి నిబద్ధతతో ముందుకెళ్తోందని వివరించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలనను అమలు పరుస్తూ అన్ని వర్గాల మద్దతును పొందుతోందని తెలిపారు. బారాస నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మళ్లీ మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని, కానీ ప్రజలు అవి నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారు అని వారు వ్యాఖ్యానించారు.
