
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్లోబల్ షో టో కాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్లో వేసవి ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ పర్యవేక్షణలో ఈ తరగతులు స్థానిక న్యూ కాకతీయ మోడల్ స్కూల్లో ప్రతిరోజు సాయంత్రం జరుగుతున్నాయి.
పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ఆటల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కరాటే ఒక చక్కని ప్రత్యామ్నాయమని కరాటే మాస్టర్ జలీల్ అభిప్రాయపడ్డారు. కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లలకు ఆరోగ్యం, ఫిట్నెస్తో పాటు క్రమశిక్షణ అలవడుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ పెంచడానికి కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కరాటే ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు ఒక మంచి మార్గం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ కే సమ్మయ్య మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. చదువుతోపాటు మనసు యొక్క ఏకాగ్రత, శారీరక దృఢత్వం మరియు స్వీయ రక్షణకు కరాటే ఒక ముఖ్యమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎక్సైజ్ ఎస్సై వినోద్ మాట్లాడుతూ, కరాటే శిక్షణ క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేస్తుందని తెలిపారు. నేటి పిల్లలకు చదువుతోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని, విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ముందుండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ సమ్మయ్య, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ఆప్కారి ఎస్సై వినోద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, ఏఎంసి మాజీ డైరెక్టర్ మొహమ్మద్ ఖాళీద్ హుస్సేన్, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కే సమ్మయ్య, బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ టి లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొని కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ను అభినందించారు.


వేసవి ఉచిత కోచింగ్ ప్రారంభిస్తున్న అతిథులు..

కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాళీదు హుస్సేన్

మాట్లాడుతున్న ఎక్సైజ్ ఎస్ఐ వినోద్





