
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన నవజీవన్ సామిల్ వ్యాపారి రావుల ప్రభాకర్ మున్సిపల్ సిబ్బంది సుమారు 150 మందికి పైగా విందు భోజనం పెట్టడంతో పాటు కొత్త బట్టలను అందజేసి తన ఔధార్యాన్ని చాటుకున్నాడు. వివరాలలోకి వెళితే ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన సామిల్ వ్యాపారి రావుల ప్రభాకర్ – శ్రీమతి దంపతుల కుమారుడు రావుల నాగేంద్ర- తారల వివాహ రిసెప్షన్ ఆదివారం స్థానిక వెంకటసాయి గార్డెన్ లో రంగ రంగ వైభవంగా నిర్వహించారు. ప్రభాకర్ -శ్రీమతి దంపతుల కుమారుని వివాహాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ మునిసిపల్ పారిశుద్ధ్య, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు 150 మందికి పైగా కుటుంబాలతో సహా ఆహ్వానించి పెళ్లి విందు భోజనం పెట్టడంతో పాటు మహిళలకు చీరలు, జాకెట్ పీసులు అందజేయగా పురుషులకు ప్యాంటు, షర్టు పీస్ లను అందజేశారు. వివాహానికి హాజరైన బంధుమిత్రులతో పాటు హుజురాబాద్ పట్టణానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అందరూ అతిథుల చేతుల మీదుగా మున్సిపల్ సిబ్బందికి బట్టలను అందజేశారు. పరులకు 10 పైసలు ఖర్చు చేయాలంటేనే ఎంతో ఆలోచించే నేటి తరుణంలో ఎంతో పెద్ద మనసుతో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పారిశుద్ధ పనులు చేస్తూ ఆరోగ్య ప్రదాతలుగా మారిన పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించడం ప్రభాకర్ దంపతుల పెద్ద మనసుకు నిదర్శనం. పెళ్లి విందుకు ఆహ్వానించడమే ఎంతో భారంగా భావించే నేటి తరుణంలో ప్రభాకర్ తన కుమారుని వివాహాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని కుమ్మరివాడ, ప్రతాపవాడ, ఫకీర్వాడ, శివాజీ నగర్, హనుమాన్ టెంపుల్ ఏరియా, వరంగల్ రోడ్ ఏరియా, విద్యానగర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు రెండు వెయ్యిల మందికి పైగా ప్రజలను ఆహ్వానించి (పెళ్లి)విందు భోజనం ఏర్పాటు చేశారు. ప్రభాకర్ శ్రీమతి దంపతులు మున్సిపల్ సిబ్బందికి సుమారు 75 వేలకు పైగా విలువ చేసే బట్టలను పంపిణీ చేసి తమ ఔదార్యంను చాటుకున్నందుకు మున్సిపల్ సిబ్బంది కృతజ్ఞతలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు అభినందనలు తెలిపారు.






సుమారు 150 మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేస్తున్న సామిల్ వ్యాపారి రావుల ప్రభాకర్ – శ్రీమతి దంపతులు..