
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 21 రోజులపాటు హనుమాన్ మాల ధరించి ఎంతో నిష్టగా ఉన్న ఆ యువకుడు మాల తీసిన మరుక్షణమే ఒక్కసారిగా అనారోగ్యానికి గురై గుండెపోటుతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామానికి చెందిన నీరటి శ్రీనివాస్-స్వరూప దంపతులు హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ ఐబీపీ పెట్రోల్ పంపు వెనక సైడు ఇల్లు కొనుగోలు చేసి కుటుంబంతో సహా ఇక్కడే గత కొన్నాళ్లుగా ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు నీరటి శిశేశ్వర్ (32) బీటెక్ పూర్తి చేసి గత కొన్నాళ్ల క్రితం ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేసీ మానేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇటీవల 21 రోజులుగా హనుమాన్ మాల ధరించి భక్తితో ఉపవాసాలు ఉంటూ భగవంతున్నీ కొలిచాడు. ఉపవాసాలతో పూర్తిగా నీరసించి ఆరోగ్యం క్షీణించడంతో మాల తీసిన రోజే (నిన్న) ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు వెంటనే తల్లిదండ్రులు పట్టణంలో ఓ ప్రైవేటు వైద్యునికి చూపించి అన్ని పరీక్షలు చేయించారు. ఆరోగ్యానికి అవసరమైన సరిపడ ఆహారం, పూర్తిస్థాయిలో తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురయ్యాడని వైద్యుడు మాత్రలు రాసి ఇంటికి పంపించాడు. ఈరోజు మధ్యాహ్నము బాత్రూములో స్నానం చేసి ఇంటి లోపలికి వస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తల్లిదండ్రులు కాళ్లు రెక్కలను తీడుతూ స్థానిక ఆర్ఎంపి వైద్యునికి ఫోన్ చేయగా సదరు ఆర్ఎంపి వైద్యుడు వచ్చి పరీక్షించి మెరుగైన వైద్యం కోసం పట్టణానికి తీసుకుపోవాలని సూచించాడు. 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. అయితే షిశేశ్వర్ ను ఆయన పెద్దనాన్న నీరటి బాబు కొన్నాళ్లు పెంచి పెద్ద చేయగా గత కొన్నాళ్ల క్రితమే సొంత తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటున్నాడు. ఇలా ఒక యువకుడు హనుమాన్ మాల ధరించి తీసిన మరుక్షణమే అనారోగ్యానికి గురై ఒకసారిగా గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబంలోనే కాక పెంచి పెద్ద చేసిన వారి కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నింపింది. యువకుడి మృతి వార్త తెలియగానే స్థానికులు, గ్రామస్తులు పలువురు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.


నీరటి శిశేశ్వర్ (32)