
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ మే 28: కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా ఎక్సైజ్ అధికారి పర్యవేక్షణలో ఈరోజు హుజురాబాద్ మండలంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సబ్-ఇన్స్పెక్టర్లు, మరియు సిబ్బంది కలిసి 9 మద్యం దుకాణాలను పరిశీలించారు.
ఈ తనిఖీలలో భాగంగా హుజురాబాద్లోని నాగేంద్ర వైన్స్ (G.NO KRNO68) దుకాణంలో రోజువారీ అకౌంట్ రిజిస్టర్ సరిగా నిర్వహించనందుకు గాను ఆ షాపుపై టెక్నికల్ కేసు నమోదు చేశారు. అనంతరం హుజురాబాద్ మండలంలోని అక్రమ మద్యం అమ్మకాలపై దృష్టి సారించి, బెల్టు దుకాణాలపై దాడులు నిర్వహించారు. బోర్నపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న కేశినేని శ్రీనివాస్ ను పట్టుకొని కేసు నమోదు చేశారు. అలాగే, కనుకులగిద్ద గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న అనూరి ఇజ్జగిరి కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
అక్రమంగా మద్యం అమ్మకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, హుజురాబాద్ తాళ్లపెల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ తనిఖీలలో ప్రాహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హుజురాబాద్ సిబ్బంది పాల్గొన్నారు.

బెల్ట్ షాప్ లో పట్టుకున్న మద్యంతో ఎక్సైజ్ ఎస్సై, సిబ్బంది

పట్టణంలోని ఓ వైన్స్ షాపును తనిఖీ చేస్తున్న ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది.