
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ శివారులోని కాకతీయ కాలువ బ్రిడ్జ్ వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగి ఓ లారీ డ్రైవర్ దుర్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో లారీ డ్రైవర్ ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామానికి చెందిన దాచేపల్లి కృష్ణ కిషోర్ (44)క్యాబిన్లో ఇరుక్కొని గంట సేపు నరకయాతన అనుభవించి ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడు. గ్రామస్తులు గంటన్నర పాటు తీవ్రంగా శ్రమించి క్యాబిన్లో ఇరుక్కున్న అతన్ని బయటకు తీసి 108 అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో డ్రైవర్ మరణించాడు. దీంతో డ్రైవర్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గాయపడ్డ లారీ క్లీనర్ మస్తాన్కు, మరో డ్రైవర్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతోనే లారీ డ్రైవర్ ఎక్కువసేపు క్యాబిన్లో ఇరుక్కుని ఉండి రక్తస్రావం జరిగి చనిపోయాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా రెండు లారీలు జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై గంటకు పైగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు దారి మళ్లించి వాహనాలను సైదాపూర్ బైపాస్ రోడ్డు గుండా తరలించారు.




ప్రధాన రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న దృశ్యం. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు,