
– సాక్షి కార్యాలయాలపై దాడులు.. కొమ్మినేని అరెస్టును నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఆందోళన..
ఏపీ ప్రభుత్వం.. పోలీసుల వైఖరిని ఖండించిన నాయకులు..
– హనుమకొండ కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ:
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులు, సాక్షి మీడియా కార్యాలయాలపై పాశువికంగా దాడులు చేస్తూ అక్రమ కేసులు నమోదు చేయడాన్ని హనుమకొండ జిల్లా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వ వైఖరినీ నిరసిస్తూ మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్ల కార్డులు పట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) హనుమకొండ జిల్లా అధ్యక్షులు, “సాక్షి” ఉమ్మడి వరంగల్ బ్యూరో ఇన్చార్జ్ గడ్డం రాజిరెడ్డి
మాట్లాడుతూ…ఏపీ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక చతికిలబడిందని ఈ అంశంలో ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి సాక్షి జర్నలిస్టులు…సాక్షి మీడియా కార్యాలయాలపై అక్రమ దాడులకు పాల్పడుతోందని, అక్రమ కేసులు నమోదు చేస్తోందని అన్నారు. జర్నలిస్టులు మీడియా కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్యం పై దాడిగా వారు అభివర్ణించారు. ఇలాంటి దాడులు.. అరెస్టులు వంటి ఘటనలు భవిష్యత్తులో కొనసాగితే సహించేది లేదని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఆందోళన ఉదృతం చేస్తామని పత్రికా స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు కునేందుకు సీనియర్ జర్నలిస్టులు మేధావులు ప్రజాసంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీలో కొనసాగుతున్న రాక్షస చర్యలు ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు లాంటిది అన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయనను భేషరతుగా విడుదల చేయాలని, పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ వైఖరి …పోలీసుల తీరు ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. పత్రికా కార్యాలయాలపై రాళ్లు… కర్రలతో దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుందన్నారు. రాజకీయ దురుద్దేశాలతో జర్నలిస్టులు పత్రిక కార్యాలయాలపై దాడులు తగవన్నారు. ఇది పెడ దోరణలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తున్నట్టు తెలిపారు లేదంటే పర్యవసానం అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎడిషన్ ఇంచార్జ్ వరదెల్లి లింగయ్య, టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, తెలంగాణ జర్నలిస్టు ఫెడరేషన్ హన్మకొండ శాఖ అధ్యక్షులు టివి రాజు, ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, సహాయ కార్యదర్శి పొడిశెట్టి విష్ణువర్ధన్, టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడి పెళ్లి మధు, టీయూడబ్ల్యూజే హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర కన్వీనర్ వల్లాల వెంకటరమణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకణాల సంతోష్, కౌన్సిల్ సభ్యులు నల్లాల బుచ్చిరెడ్డి, చిన్న పత్రికల సంఘం జిల్లా నాయకులు అంతడుపుల శ్రీనివాస్, సాక్షి వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ వాంకే శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు ఊటుకూరు సాయిరాం, సీనియర్ జర్నలిస్టులు బత్తిని రాజేందర్ గౌడ్, కొల్ల కృష్ణకుమార్ రెడ్డి, నరేష్, ఎ నరేందర్, జి రమేష్, ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి యాంసాని శ్రీనివాస్, జన నిర్ణయం ఎడిటర్ దామెర రాజేందర్, కొలనుపాక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు..

మాట్లాడుతున్న టియుడబ్ల్యూజే(ఐజేయు) హనుమకొండ జిల్లా అధ్యక్షులు, “సాక్షి” ఉమ్మడి వరంగల్ బ్యూరో ఇన్చార్జ్ గడ్డం రాజిరెడ్డి..
