
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జూన్ 14: వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి వనిత క్వీన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో “డాన్ టు డెస్క్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు హుజూరాబాద్లోని స్కూల్ గ్రౌండ్లో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వాసవి డయాగ్నోస్టిక్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరం ఈ కార్యక్రమాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ శిబిరంలో భాగంగా దాదాపు 300 మందికి రక్త పరీక్షలు నిర్వహించి, మధుమేహ నిర్ధారణ చేశారు. హుజూరాబాద్ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని, నిర్వాహకులపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇతర ముఖ్యమైన పనులు కూడా చేపట్టారూ. మంథనపల్లిలోని పంచముఖ ఆంజనేయ దేవాలయానికి 1000 లీటర్ల నీటి ట్యాంకును బహూకరించారు. మానసిక దివ్యాంగులను గుర్తించేందుకు ఉపయోగపడే ₹1500 విలువైన కిట్ను NIPID సంస్థకు అందజేశారు. దేశ సేవలో విశేష కృషి చేసి రిటైర్ అయిన జవాన్ శ్రీ రామస్వామిని ఘనంగా సత్కరించారు. చెప్పులు కుట్టి జీవనం సాగిస్తున్న రాజయ్యను సన్మానించి, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.”సరస్వతి పథకం” కింద నిరుపేద విద్యార్థులకు 100 లాంగ్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో క్లబ్ ఇంచార్జ్లు కృష్ణవేణి, లచ్చయ్య, రీజియన్ చైర్మన్లు కృష్ణ, అయిత రమ, జోనల్ చైర్మన్ నంగునూరి శైలజ, ప్రెసిడెంట్ డాక్టర్ అర్చన నార్ల, ట్రెజరర్ చీకోటి త్రివేణి తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు కొనియాడారు.

వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గంను సన్మానిస్తున్న వనిత క్లబ్ నాయకులు..



