
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, జూన్ 23: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ప్రభుత్వం డంపింగ్ యార్డ్, విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాన్ని నిర్మించేందుకు యత్నిస్తున్న నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సిర్సపల్లితో పాటు చుట్టుపక్కల పది గ్రామాల ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడనుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రత్యక్షంగా నివసించే ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఈ ప్రాంత రైతుల వ్యవసాయ భూములు నష్టపోయే అవకాశం ఉందని, భూసారం తగ్గి పంటల దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును తక్షణం ఆపివేయాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఈ అంశంపై సానుకూలంగా స్పందించారనీ గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ పిఎసిఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండారెడ్డి, హుజురాబాద్ మండల వైస్ ఎంపీపీ బండి రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు సింగిరాల రామరాజు, పోతిరెడ్డిపేట బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చెన్నోజు రమేష్. బీఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి ఎడ్ల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పిఎ సిఎస్ చైర్మన్ కొండాల్ రెడ్డి, సిరసపల్లి గ్రామస్తులు..