
–సీఎం రిలీఫ్ ఫండ్ తో.. బాధితులకు ఊరట..
–హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
–లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందించిన కౌశిక్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక) జులై 4: నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు కొంతమేర ఊరట కలిగిస్తున్నాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ మండలం వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో ఆయన శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. బేతిగల్, నర్సింగాపూర్, వీణవంక, రెడ్డిపల్లి, ఘన్ముక్ల, మల్లన్న పల్లి, బొంతపల్లి, గంగారం, ఎలబాక, చల్లూరు, ఇప్పలపల్లి, మామిడాలపల్లి, మల్లారెడ్డిపల్లి, దేశాయిపేట, కిష్టంపేట, నరసింహులపల్లి, శ్రీరాములపేట, హిమ్మత్ నగర్, కొండపాక, పోతిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 69 మంది లబ్ధిదారులకు రూ.14 లక్షల, 88 వేల 500 విలువ చేసే చెక్కులను ఆయన ఆయా గ్రామాలకు వెళ్లి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులను వీలైనంత తొందరగా అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. 2014 కంటే ముందు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎవరికి తెలిసేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిరుపేదల వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ బడ్జెట్ను పెంచారని గుర్తు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరుపేదల వైద్య ఖర్చుల చెల్లింపులను మరింత సులభతరం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో వేలాదిమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి చేకూరిందని అన్నారు.
తులం బంగారం ఏమైంది?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడం లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విమర్శించారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పారని అది ఇప్పటివరకు అమలు కాలేదని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ను నిలిపివేయడంతో అన్నదాతలు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. రైతు భరోసా పథకం కూడా అందరికీ రావడం లేదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో.. బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ప్రజలంతా మళ్ళీ ముక్తకంఠంతో కెసిఆర్ రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నారని, కేసులతో, అరెస్టులతో ప్రజా పోరాటాలను ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ వాలా బాలకిషన్ రావు, మాజీ ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ వనమాల సాదవ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, వీణవంక బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



——————–+++++++———————-
&పత్రికా ప్రకటనలు(యాడ్స్)#
—————–+++++++——————-






