
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ : సినీ ప్రముఖులు, అభిమానులు, కళాకారులు, కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.
అంతకు ముందు ఫిల్మ్నగర్లోని కోట శ్రీనివాసరావు నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది. ఇందులో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు పాల్గొని కోటకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ప్రధాని మోడీ నివాళి..
అంతకు మందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట శ్రీనివాసరావు మృతికి సంతాపం తెలిపారు. సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు..’ కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారనీ ప్రధాని మోడీ పేర్కొన్నారు
సుమారు 800 ల్లో నటించి మెప్పించిన కోట శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆదివారం (జులై 13) ఉదయం ఫిల్మ్నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోట భౌతిక కాయాన్ని సందర్శించారు. నటుడికి ఘనంగా నివాళులు అర్పించారు.

సినీ నటుడు కోట శ్రీనివాసరావు (ఫైల్)





