Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: వరంగల్, హన్మకొండ, కెయూసి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రముఖ కంపెనీ బ్రాండ్లలైన పాలీకాబ్, వి.గార్డ్, గోల్డ్మెడల్, ఫీనోలెక్స్, చార్భుజా, యాంఖర్, లీగ్రాండ్ కంపెనీలకు సంబందించిన నకిలీ ఎలక్ట్రికల్ గృహోపకరణాలు విక్రయిస్తున్న అరుగురు వ్యక్తులను వరంగల్ టాస్క్ఫోర్స్ మట్టెవాడ,కేయూసి,హన్మకొండ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల నుండి సుమారు 32 లక్షల విలువగల నకిలీ ఎలక్ట్రికల్ గృహోపకరణాలు (కరెంటు వైర్లు, స్విచ్ బోర్డులు), ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన నిందితులు: 1. పొనమారం చౌదరీ,వయస్సు 30, పెడగపల్లి డబ్బాలు,హన్మకొండ, 2.రాజ్పురోహిత్ బీరుసింగ్, వయస్సు 60, రామన్నపేట, వరంగల్, 3.కాంతిలాల్, వయస్సు 34, పెగడపల్లి డబ్బాలు, హన్మకొండ, 4.పురోహిత్ శ్రవణ్కుమార్,వయస్సు 28, హైదరాబాద్, 5.పురోహిత్ భరత్కుమార్,వయస్సు 35, హైదరాబాద్, 6.ఆమృత్ జైన్, వయస్సు 42, హైదరాబాద్కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
ఈ అరెస్టుకు సంబంధించి సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా వివరాలను వెల్లడిస్తూ.. వరంగల్ ట్రై సిటి పరిధిలో నకలీ ఎలక్ట్రికల్స్ వస్తువులను విక్రయించేందుకుగా నగరానికి ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ విభాగానికి అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ మరియు స్థానిక పోలీస్ స్టేషన్ పోలీసుల అధ్వర్యంలో వరంగల్ జె.పి.యన్, రోడ్లోని మహెంద్ర ఎంటర్ప్రైజెసన్, హన్మకొండలోని హనుమాన్ నగర్లోని శ్రీఆర్బుదా ఎలక్ట్రికల్స్ మరియు సానిటరీ, కేయూసి పరిధిలో కెయూ రోడ్డులోని సాయి గణేష్ ఎలక్ట్రికల్స్ షాపుల్లో ఒకే సమయంలో పోలీసులు దాడులు నిర్వహించగా ప్రజలను మోసం చేస్తూ నాణ్యత లేని మరియు ప్రముఖ కంపెనీ బ్రాండ్ల పేర్లతో నకిలీ ఎలక్ట్రికల్స్ వస్తువులైన కరెంటు వైర్లు, స్విచ్ బోర్డులను విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. దీనితో పోలీసులు దాడులు నిర్వహించిన మూడు షాపుల నుండి పెద్ద మొత్తంలో నకిలీ ఎలక్ట్రికల్స్ గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మహెంద్ర ఎంటర్ప్రైజెస్లో సూమారు 10లక్షల 37వేలు, శ్రీఆర్బుదా ఎలక్ట్రికల్స్ మరియు సానిటరీ దుకాణంలో 44 వేలు, సాయి గణేష్ ఎలక్ట్రికల్స్ దుకాణంలో సుమారుగా 20 లక్షల 70 వేల విలువగల నకిలీ ఎలక్ట్రికల్ గృహోపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఈ మూడు దుకాణాలకు చెందిన యజమానులతో పాటు, నకిలీ సామాను విక్రయించేందుకు వచ్చిన నిందితుల్లో కేయూసి పరిధిలో ఇద్దరు, మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరిని అరెస్టు చేయడం జరిగిందని, పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన పురోహిత్ భరత్ కుమార్పై హైదరాబాద్లో గతంలో మూడు కేసులు నమోదు కాగా, మరో ఇద్దరు నిందితులు పొనమారం చౌదరీ, కాంతిలాల్పై కెయూసి,హన్మకొండ పోలీస్స్టేషన్ల పరిధిలో గతలో ఒకటి చోప్పున కేసులు నమోదు అయినట్లు డిసిపి తెలియజేసారు.
ప్రజలకు విజ్ఞప్తి:
నిందితులు ప్రఖ్యాత కంపెనీల నకిలీ ఉత్పత్తులను తయారు చేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారని, నకిలీ ఉత్పత్తులను గుర్తించడం ప్రజలకు కష్టమవుతుందని, ఈ విషయంలో ప్రజలు ఎలక్ట్రికల్ గృహోపకరణ ఉత్పత్తులను అధికారిక అవుట్లెట్లలో మాత్రమే కొనుగోలు చేయాలని అభ్యర్థించారు. అంతేకాకుండా, సంబంధిత కంపెనీలు తమ యొక్క ఉత్పత్తులకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని వార్తాపత్రికలలో మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించడం ద్వారా ప్రజలకు నిజమైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వీలు కల్పించాలని కూడా అభ్యర్థించారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన వరంగల్ ఏ ఎస్పీ శుభం, టాస్క్ఫోర్స్ ఏసిపి మధుసూధన్, హన్మకొండ ఏసిపి నర్సింహరావు, టాస్క్ఫోర్స్ ఇన్స్స్పెక్టర్ సార్ల రాజు, కెయూసి, మట్టేవాడ,హన్మకొండ ఇన్స్స్పెక్టర్లు రవికుమార్, గొపి, శివకుమార్, ఎఎఓ సల్మాన్ పాషా, టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆర్.ఎస్.ఐ భానుప్రకాశ్, ఏ.ఎస్.ఐలు రాజేశ్వరీ, ఉప్పలయ్య, కానిస్టేబుళ్లు సురేష్, సురేందర్, సాంబరాజులను డిసిపి అభినందించారు.






