
– ఎసిపి మాధవిని పరామర్శించి ఓదార్చిన పోలీసు సిబ్బంది
– కరీంనగర్ సప్తగిరి స్మశాన వాటికలో ముగిసిన అంత్యక్రియలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జులై 19: కరీంనగర్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఏసిపి, హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి భర్త జీ మహేష్ నిన్న గుండెపోటుతో హుజురాబాద్లో మృతిచెందగా కరీంనగర్లో శనివారం అంత్యక్రియలు ఖాకీలు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య జరిగాయి. విషణ్ణ వదనంతో అయన పెద్ద కుమారుడు తన తండ్రి చితికి నిప్పంటించడం పలువురిని కలచివేసింది. మహేష్ మృత దేహాన్ని చూసి పలువురు కంట తడిపెట్టారు. మహేష్ సతీమణి, హుజురాబాద్ ఎసిపి మాధవిని పలువురు పరామర్శించి ఓదార్చారు. పూర్వ కరీంనగర్ జిల్లాతో పాటు, పలు జిల్లాల నుండి పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది మహేష్ పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున కరీంనగర్ కు తరలివచ్చారు. పలువురు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు పలువురిని కదిలించివేసింది. కరీంనగర్ సిపి గౌస్ అలాం హాజరై మృతదేహానికి సెల్యూట్ చేయగా ప్రత్యేక పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేసీ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
పలువురి సంతాపం
హుజురాబాద్ ఎసిపి మాధవి భర్త, పిటిసి ఎసిపి మహేష్ మృతి పట్ల మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, కాంగ్రెస్ నేత వొడితల ప్రణవ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు, హుజురాబాద్ డివిజన్ పోలీస్ అధికారులు, వివిధ పార్టీల నేతలు బండ శ్రీనివాస్, పూసల ప్రభావతి రెడ్డి, వర్దినేని రవీందర్ రావు, ఇరుమల్ల సురేందర్ రెడ్డి, గందె శ్రీనివాస్, వడ్లూరి విజయ్ కుమార్, కౌరు సుగుణాకర్ రెడ్డి, కొలిపాక శ్రీనివాస్, గుడిపాటి జయపాల్ రెడ్డి, మైకేల్ పలువురు సీనియర్ పాత్రికేయులు, తదితరులు సంతాపం తెలిపారు.

పోలీస్ అధికారుల లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం..


తండ్రి చితికి తలకొరివి పెడుతున్న పెద్ద కుమారుడు..








