
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక(ప్రరవే) వ్యవస్థాపక సభ్యురాలు,ఆ సంస్థకు ప్రస్తుతం జాతీయ అధ్యక్షురాలుగా పనిచేస్తున్న ప్రముఖ కవయిత్రి అనిశెట్టి రజిత అకాల మరణం తెలుగు సాహిత్యోద్యమానికి తీరని లోటు.రజిత కేవలం సాహిత్య సృజనకే పరిమితం కాకుండా సామాజిక ఉద్యమాల్లో ముఖ్యంగా స్త్రీవాద ఉద్యమాల్లో ఆమె ప్రత్యక్ష ప్రాతినిధ్యం విస్మరించలేనిదని హుజూరాబాద్ జనసాహితి సాహిత్య సంస్థ అనిశెట్టి రజితకు నివాళులు అర్పించింది. అనిశెట్టి రజిత సోమవారం నాడు హన్మకొండలో మరణించింది. విద్యార్థి దశనుండే ప్రోగ్రెసివ్ ఉమన్ ఆర్గనైజేషన్(పి.ఒ. డబ్ల్యు) సంస్థ ద్వారా ప్రభావితమై సామాజిక చలనాలకు స్పందిస్తూ కవిత్వాన్ని రాయడం ప్రారంభించి 1984 లో “గులాబీలు జ్వలిస్తున్నాయి” అన్న మొదటి కవితా సంపుటిని వెలువరించింది. ఆ తర్వాత “నేనొక నల్ల మబ్బునవుతా”(1997),”చెమట చెట్టు”(1998),”ఉసురు”(2002),”అనగా అనగా కాలం”(2005), “దస్తఖత్”(2005), నానీలు”గోరంతదీపాలు”(2005),2007 లో రాసిన హైకూలు,అలాగే దీర్ఘ కవితలతో పాటు, 2016లో రాసిన “నిర్భయాకాశం కింద” అనే కవితా సంపుటిలు బహుళ ప్రచారం పొందాయి.కొన్ని కథలు కూడా రాసారు.
అనిశెట్టి రజిత ఉపన్యాసకురాలు, గాయకురాలు కూడా…
అనిశెట్టి రజిత కలం, గళం అనునిత్యం అణగారిన ప్రజలకు అండగా నిలిచాయి. అనిశెట్టి రజిత ప్రజాస్వామిక రచయిత్రులు వేదిక ఏర్పాటులో కీలక పాత్రను పోషించింది. అనిశెట్టి రజిత మరణం పట్ల హుజూరాబాద్ జనసాహితి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. జనసాహితి హుజూరాబాద్ తరపున ఆవునూరి సమ్మయ్య, ముక్కెర రాజు, పల్కల ఈశ్వర్ రెడ్డి, రవిశంకర్ శుక్లా, దళిత ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.

అనిశెట్టి రజిత (ఫైల్)





