
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంతంలో మంగలి మనీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే నాయి బ్రాహ్మణ సంఘానికి పెద్దదిక్కుగా ఉన్న ఆయన కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. హుజురాబాద్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్న హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ కు చెందిన సూరంపల్లి మనయ్య(76) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మనయ్యకు భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందగా ఆయనకు ప్రస్తుతం ముగ్గురు కుమారులు శ్రీనివాస్, సత్యనారాయణ, సుభాష్, ఓ కుమార్తె తిరుమల ఉన్నారు. మనయ్య తన చిన్నతనంలో ఏడో తరగతి వరకు చదువుకొని తన తోటి విద్యార్థులకు, వయోవృద్ధులకు రాత్రి బడి చెప్పడం జరిగింది.1969 లో తెలంగాణ తొలి పోరాటంలో పాల్గొని నాడు తను జైలుకు వెళ్లడం జరిగింది. అంతేగాక మలిదశ ఉద్యమంలో కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నాడు. హుజురాబాద్ నాయి బ్రాహ్మణ సంఘం ఏర్పాటు కోసం ఆయన తన వంతు కృషి చేయడం జరిగింది. సంఘం అభివృద్ధి కోసం, సంఘం నిర్మాణం కోసం ఎన్నో కార్యక్రమాలను ముందుండి నడిపించడం జరిగింది. అతను తను ఉన్నంత కాలంలో గౌరవ అధ్యక్షునిగా మరియు సంఘం ఉపాధ్యక్షులుగా సంఘానికి ఎన్నో సహాయ సహకారాలు అందించడం జరిగింది. తను చేసిన వివిధ సామాజిక సాంఘిక సేవ కార్యక్రమాలను ముందుండి నడిపించడం హుజురాబాద్ ప్రాంతంలో చిరకాలం గుర్తుండిపోతాయి. అలాంటి ఎంతో సుపరిచితుడు గొప్ప వ్యక్తి అకాల మరణం చెందడం హుజూరాబాద్ ప్రాంతానికి తీరని లోటని తెలంగాణ ఉద్యమకారులు, దళిత ప్రజా సంఘాల నాయకులు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆయన మరణానికి సంతాపంగా ఒకరోజు సెలూన్ షాపులను బందు పాటించడం జరిగింది.

సూరంపల్లి మనయ్య (ఫైల్ ఫోటో)





