
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపులో గల రైతు వేదికలో బుధవారం రైతులకు డీలర్లకు నానో యూరియా వాడకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో హుజురాబాద్ ఏడిఏ జి సునీత మాట్లాడుతూ..నూతన వ్యవసాయ పద్ధతులు, పర్యావరణ పరిరక్షణ, రైతులకు పెట్టుబడి ఖర్చుల తగ్గింపు లక్ష్యంగా వ్యవసాయ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
హుజురాబాద్ డివిజన్ IFFCO సహకారంతో నానో ఎరువులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సాంప్రదాయ యూరియా, డీఏపీల వాడకం వల్ల నేల, నీరు కలుషితం అవుతాయని, పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయని అన్నారు. నానో యూరియా, నానో డీఏపీ వంటి ద్రవ రూప ఎరువులు వాడటం ద్వారా తక్కువ పరిమాణంలోనే అధిక దిగుబడి సాధించవచ్చని అన్నారు. నానో ఎరువుల వినియోగ సామర్థ్యం 80% వరకు ఉంటుందని, వీటిని పంటకాలంలో ఒకసారి పిచికారీ చేసుకుంటే సరిపోతుందని రైతులకు వివరించారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు క్షేత్ర ప్రదర్శనల ద్వారా రైతులకు నానో ఎరువులపై అవగాహన కల్పించనున్నారని అన్నారు.
IFFCO కంపెనీ జిల్లా మేనేజర్ బాలాజీ మాట్లాడుతూ…. నానో ఎరువుల వల్ల పంట దిగుబడి పెంపు, భూసారం మెరుగుదల, రైతులకు వ్యయ భారం తగ్గింపు వంటి అంశాలపై వివరించారు. నానో యూరియా కొనుగోలు చేసిన రైతుకు ప్రమాద బీమా కలదు అని వివరించారు. నాలో యూరియా వాడకంపై పలువురు రైతులు తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. నానో ఎరువులు వ్యవసాయ రంగాన్ని ఎలా విప్లవాత్మకంగా మార్చగలవో, పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులను ఎలా ప్రోత్సహించగలవో నిపుణులు రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమoలో హుజురాబాద్ మండల వ్యవసాయ అధికారి సిహెచ్ భూమిరెడ్డి, ఇఫ్కో జిల్లా మేనేజర్ బాలాజి, పలువురు ఏవోలు సూర్యనారాయణ , శ్రీ గణేష్, వైదేహి, ఖాదర్ హుస్సేన్ , ఏ ఈ ఓ నిఖిల్, డీలర్లు, అభ్యుదయ రైతులు. తదితరులు పాల్గొన్నారు.








