
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా నిజాం నిరంకుశ, రజాకార్ల అరాచకత్వ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రాంతానికి 1948 , సెప్టెంబర్ 17 న విముక్తి లభించి స్వేచ్చా స్వాతంత్ర్యం సిడ్డించిందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విముక్తి దినోత్సవ సమావేశంలో పోలాడి రామారావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడారు.
బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి దేశానికి 1947, ఆగస్ట్ 15 న స్వాతంత్ర్య సిద్దించగా, దేశ హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు సైనిక చర్య తో నిజాం అనే పిశాచ పీడ విరుగడైన రోజు, ఎంతోమంది అమర వీరుల ఆత్మ ఆనంద తాండవ రోజైన సెప్టెంబర్ 17,1948 లో తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించి స్వేచ్చా స్వాతంత్ర్యం సుద్దించిందని రామారావు అన్నారు.
అప్పట్లో నిజాం పాలనలో రజాకార్ల దురాగతాలను వివరిస్తూ పన్ను చెల్లించని వారి గోర్లు ఊడగొట్టి, ఇళ్లల్లో రజాకార్ల ముష్కర్లు చొరబడి భర్తల కళ్లెదుటే భార్యల పై అత్యాచారాలు చేసే వారని,మహిళలను వివస్త్రలను చేసి నగ్నంగా ఉంచి బతుకమ్మలను ఆడించే వారని, భార్యల ముందే భర్తలను పాశవికంగా చంపి అనేక దురాగతాలకు పాల్పడే వారని రైతులను ఊచకోత కోసి కర్కశంగా ప్రవర్తించి ఇళ్లను తగులబెట్టి నిలువ నీడ లేకుండా చేశారని పోలాడి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దశలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తో ఎందరో యోధులు నిజంను గడ గడ గడ లాడించి అమరులైన వీరులకు రామారావు జోహార్లు అర్పించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలతో పలు రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17 వ రోజును వివిధ పేర్ల తో నిర్వహించడం దారుణమని మండి పడ్డారు.
ఇది అసలైన తెలంగాణ ప్రాంత విముక్త స్వేచ్చా స్వాతంత్ర్య దినోత్సవ రోజని రామారావు అభిప్రాయ పడ్డారు. సైనిక చర్య తో నిజాం మెడలు వంచిన అప్పటి హోం మంత్రి కీ.శే.సర్దార్ వల్లభాయ్ పటేల్ కు తెలంగాణా జాతి రుణపడి ఉంటుందని తెలుపుతూ ప్రజా సంఘాల సమాఖ్య తరపున భారత ప్రధాని నరేంద్ర మోడి కి 75 వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.

మాట్లాడుతున్న రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..





