
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ ఉద్యమం కోసం డీఎస్పీ ఉద్యోగాన్ని త్యాగం చేసిన ఉద్యమకారురాలు నళిని అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆసుపత్రికి వెళ్ళి ఆమెను పరామర్శించారు. బోయినపల్లిలో పతంజలి వెల్ నెస్ సెంటర్ లో చికిత్స పొందుతున్న ఆమెను కలిసి ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకున్నారు. ఉద్యమ సమయాన్ని ఇరువురు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక పక్క ఉద్యమ తీవ్రత పెరగడం.. మరోపక్క తెలంగాణ అధికారిని అయిన తనపై అణచివేత పెరగడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేశానని నళిని గుర్తుచేసుకున్నారు. 32 సంవత్సరాల వయసులో ఉద్యోగానికి ఎంపికై 37 సంవత్సరాల వయసులోనే 2009 లోనే బయటకు వచ్చానని చెప్పారు. వారం రోజుల నుండి విపరీతమైన జ్వరం, కూర్చుంటే లేవలేని పరిస్థితి నెలకొంది, కాళ్ళు వాసిపోయాయి అని తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆర్య సమాజ్ వారు అండగా ఉన్నారు. ఈ హాస్పిటల్ మంచి వైద్యం అందిస్తున్నారన్నారు.
రాజీనామా చేసేముందు నళినిని కలిశానని ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం నుండి డబ్బులు రావడం కంటే నా ఎమోషన్స్ పట్టించుకోలేదు అనే బాధ ఎక్కువ ఉందని నళిని అన్నారు. 21 నెలలు అయినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని వాపోయారు. 16 పేజీల లేఖను సీఎం రేవంత్ రెడ్డి చేతిలో పెట్టాను.. వెంటనే పరిష్కరిస్తారు అనుకున్నా. ఇలా చేస్తారు అనుకుంటే అసలు వినతిపత్రం ఇచ్చే దానినే కాదు అన్నారు. నా లాగా ఏ ఆఫీసర్ కు కావద్దు అనుకున్నా. నన్ను సన్మానించకపోయినా పర్వాలేదు, అవమానించే అధికారం వారికి లేదు కదా.. ఇది ముమ్మాటికీ నన్ను అవమానించడమే అని నళిని అన్నారు. ఆ బాధ నా ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుందనీ బాధ పడ్డారు.
నళిని తండ్రి 60 ఏళ్ళనుండి RSS లో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న పెద్ద పెద్ద RSS లీడర్లందరికీ ఆశ్రయం ఇచ్చారని నళినీతో ఉన్న బంధువులు వివరించారు. నాలుగేళ్లుగా ఆర్యసమాజ్ తో కలిసి పని చేస్తున్నాం.. వేల మందితో యజ్ఞాలు చేయించామని, వేదం – యజ్ఞం పేరుతో సనాతన ధర్మం మీద పుస్తకం రాసాను. ఇంకో నాలుగు పుస్తకాలు రాయాలనుకున్నా కానీ ఆరోగ్యం సహకరించడం లేదని నళిని తెలిపారు. ఇక్కడ ఉన్నంత కాలం కావాల్సిన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తాము. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అని ఈటల రాజేందర్ నళినికి హామీ ఇచ్చారు. కొంత నయం అయ్యి నడిచే పరిస్థితి వచ్చిన తర్వాత నళిని కోరుకున్న చికిత్స కోసం హరిద్వారకు పంపించే ఏర్పాటు కూడా చేస్తామని ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు.

హాస్పిటల్ కి వెళ్లి డిఎస్పీ నలిని నీ పరామర్శిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్..

నలిని డిసీజ్ కి సంబంధించిన రిపోర్టును పరిశీలిస్తున్న ఎంపీ ఈటల..

ధైర్యంగా ఉండాలని నలినికి భరోసా ఇస్తున్న ఎంపీ ఈటెల..





