
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిసి రిజర్వేషన్ల సాధనకు వివిధ బిసి సంఘాలతో ఏర్పడిన ‘బిసి ఐక్య కార్యాచరణ కమిటీ’- (బిసి జెఎసి) ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు టీజేఏస్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, బంద్ లో ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటామని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని సూచించారు. బిసి బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద ఇటీవల హైకోర్టు స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయని, దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించలేదని శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్ చేసి గవర్నర్ కు పంపించినా ఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 9 షెడ్యూలులో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటును సమావేశపరిచి, ఆ ప్రక్రియను పూర్తి చేయాలని, రిజర్వేషన్లు 50 శాతం పరిమితి పేరుతో ఏళ్ళ తరబడి బిసిల రిజర్వేషన్ పెంపు అంశాన్ని నాన్చడం ఏ మాత్రం తగదన్నారు. 18 న జరిగే బంద్ కు ప్రజాస్వామికవాదు లందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు పలుకాలని ముక్కెర రాజు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు





