Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వంగర): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర పీవీ రంగారావు గురుకులంలో ఉండడానికి ఇష్టం లేక ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వరం శ్రీ వర్ష వంగర పివి రంగారావు గురుకులంలో పదవ తరగతి చదువుతుంది. వనం శ్రీ వర్ష గురుకులం నుండి ఇటీవల దీపావళి వేడుకలకు స్వగ్రామం రాంపూర్ కు వెళ్ళింది. తల్లిదండ్రులు నిన్న గురువారం పాఠశాలకు తీసుకువచ్చి వదిలేసి వెళుతుండగా తాను ఉండడానికి ఇష్టం లేదని వారి వెంటే ఇంటికి వస్తానంటు మారం చేసింది. తల్లిదండ్రులు నచ్చజెప్పి ఇంటికి వెళ్లి ఈరోజు వెళ్లి తీసుకు వద్దామా అని అనుకునే లోగానే శ్రీ వర్ష స్థానిక డార్మెంటరీలో శుక్రవారం ఉదయం తన చున్నీతో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే పదవ తరగతి విద్యార్థులకు నేటి నుండి పరీక్షలు ఉండగా తల్లిదండ్రులతో పంపేందుకు పాఠశాల ఉపాధ్యాయులు నిరాకరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పదవ తరగతిలో ఎంతో చురుకుగా, క్లాస్ ఫస్ట్ గా చదువులో రాణించే శ్రీ వర్ష ఎందుకు పాఠశాలలో ఉండేందుకు భయపడింది, తల్లిదండ్రులతో వెళ్లడానికి ఎందుకు ఇష్టపడింది.. అనే విషయాలు తెలియాల్సి ఉంది. శ్రీ వర్షను తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులు వనం తిరుపతి దంపతులు సిద్ధపడుతున్న క్రమంలోనే ఇలా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం ఆ తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేసింది. ఆత్మహత్యపై లోతుగా దర్యాప్తు చేస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. వంగర పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

స్థానిక డార్మెంటరీలో సునీత ఫ్యాన్ కొరేసుకున్న శ్రీ వర్ష





