
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల 26న ఢిల్లీలో నిర్వహించనున్న రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా తలపెట్టిన రాజ్యాంగ హక్కుల సాధన సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మాల మహానాడు నాయకులు తొగరు స్వామి పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత పార్లమెంటుకు డా. బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని, జాతీయ స్థాయిలో మాల-మహర్ అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
శాస్త్రీయమైన లెక్కలు లేకుండా చేసిన ఎస్సీ వర్గీకరణ రోస్టర్ జీవో 99, జీవో 29 రాజ్యాంగ వ్యతిరేకమని, వీటిని తక్షణమే పునఃసమీక్షించాలని నిరసన తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని,
ఎస్సీ రిజర్వేషన్ల శాతాన్ని 15 శాతం నుండి 20 శాతానికి పెంచాలన్నారు.
దళితులపై దాడులు అరికట్టి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని (అట్రాసిటీ చట్టం) పకడ్బందీగా అమలు చేయాలని,
న్యాయస్థానాల్లో, రాజ్యసభలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహకారాలు అందించాలని పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికను ప్రేయర్లలో తప్పకుండా చదివేలా ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు జూపాక శ్రీనివాస్, సొల్లు బాబు, బత్తుల సమ్మయ్య, డాక్టర్ రమేష్, కత్తరమళ్ళ సదానందం, సొల్లు దశరథం, కోడం నరసింగం, జూపాక నరసింగం తదితరులు పాల్గొన్నారు.



హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న మాల మహానాడు నాయకులు..





