
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని చెరువుల కుంటల సుందరీకరణకు మున్సిపాలిటీ అధికారులు శ్రీకారంచుట్టారు. హుజురాబాద్ మున్సిపాలిటీ 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి మూడు లక్షల రూపాయల వ్యయంతో హుజురాబాద్ పట్టణ శివారులోని మోడల్ చెరువు, గంగనకుంటలను సుందరీకరణ చేయడానికి సంకల్పించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మోడల్ చెరువు కట్టకు ఇరువైపుల దట్టంగా పెరిగిన చెట్లను జెసిబితో తొలగించే పనులు ప్రారంభించారు. హుజురాబాద్ ప్రాంత నీటి అవసరాల కోసం అత్యంత అవసరమైన మోడల్ చెరువు కోసం గతంలో స్థానిక నాయకులు పాదయాత్రలు నిరాహార దీక్షలు చేశారు. చెరువుకట్ట పూర్తయిన దానిపై రోడ్డు పూర్తి కాకపోవడంతో కట్టపైన కంకర తేలి నడిచే వారికి ఇబ్బందిగా ఉండేది. సంబంధిత శాఖ అధికారులు ఇతర పనులు పట్టించుకోకపోవడంతో మోడల్ చెరువు కట్టకు ఇరువైపులా దట్టంగా చెట్లు పెరిగాయి. వర్షం పడితే ఆ చెట్ల నుండి పెద్ద పెద్ద పాములు మామిళ్లవాడ పరిసర ప్రాంతాల ఇళ్లలోకి వచ్చేవి. మోడల్ చెరువు కట్ట ఇరువైపులా దట్టమైన చెట్లు పెరగడంతో అసాంఘిక కార్యకలాపాలు జరిగేవి. మామిళ్ళవాళ్లకు చెందిన ప్రజలు అనేకసార్లు పోలీసులకు, ఇతర అధికారులకు ఫిర్యాదులు చేసిన ఎవరు పెద్దగా స్పందించలేదు. ఇంతే కాకుండా గంగనకుంటలో చెట్లు విపరీతంగా పెరగడంతో అందులో నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోయింది. గంగనకుంట పరిసర ప్రాంతాల ను కొంతమంది కబ్జాదారులు కబ్జా చేస్తూ అనధికారికంగా నిర్మాణాలు చేశారు. భారీ వర్షాల సమయంలో గంగనకుంటలో కానీ మోడల్ చెరువులో కానీ నీటి నిలువ సామర్థ్యం తక్కువగా ఉండేది. నీరంతా వృధాగా పోయేది. ఈ రెండిటి విషయంలో ప్రజలు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేసేవారు. కాగా ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులనుండి 3 లక్షల రూపాయలు కేటాయించడంతో సుందరీ కరణ పనులు కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో వేగం పుoజుకున్నాయి. మంగళవారం మోడల్ చెరువు కట్టపై జరుగుతున్న సుందరీ కరణ పనులను మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య, ఏఈ సుధాకర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, సిబ్బంది వినయ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ ఖలీల్ హుస్సేన్, కాంగ్రెస్ నేత ఎస్కే జలీల్ తదితరులు పరిశీలించారు. సుందరీకరణ పనులు మొదలు కావడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న కమీషనర్ సమ్మయ్య, కాంగ్రెస్ నేతలు ఖాళీ చూశాను ఎస్కే జలీల్ తదితరులు..





