Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తమ స్వార్థం కోసం ఇసుక మాఫియా తనుగుల వద్ద ఉన్న చెక్ డ్యామ్ ను ధ్వంసం చేశారని బిఆర్ ఎస్ ఆరోపిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుక మాఫియాకు మద్దతు ఇవ్వడం దారుణమని హుజురాబాద్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ అన్నారు. గురువారం హుజూరాబాద్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చెక్ డ్యాములు, కాలువలు, చెరువులు నిర్మించి ప్రజలకు, రైతులకు ఉపయోగపడే పనులు జరిగాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా రెచ్చిపోయి తమ స్వార్థం కోసం చెక్ డ్యామ్ ను కూల్చి వేశారని అన్నారు. ప్రజలకు, రైతులకు నష్టం కలిగిన విషయాన్ని మాజీ మంత్రి టి హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తదితరులు ఆరోపిస్తే విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన అధికార పార్టీ అడ్డగోలుగా ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిజంగా రైతులపై, ప్రజలపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే చెక్ డ్యామ్ ధ్వంసం ఎలా జరిగిందో నిరూపణ చేయాలని, ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు అవాకులు, చేవాకులు మాట్లాడుతున్నారని, ఇది విని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ప్రజల పక్షాన ప్రతిపక్షం పోరాటం చేస్తుంటే ఇసుక మాఫియాకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలవడం, వారికి మద్దతుగా మాట్లాడడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉండాలని, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి ఇమ్రాన్, నాయకులు పంజాల కుమారస్వామి కొండ్ర నరేష్, మోలుగు అనిల్, పంజాల శ్రీధర్, మొలుగురి శ్రీనివాస్, మండ సతీష్ గౌడ్, ఎర్ర రాజ్ కుమార్, తులసి లక్ష్మణమూర్తి, డిష్ రమేష్, దిల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలీపాక శ్రీనివాస్.. పక్కన మాజీ కౌన్సిలర్లు, నాయకులు..





