
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా హుజురాబాద్ మండలంలో ఈ నెల 17న జరగబోయే ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా సహాయ ఎన్నికల అధికారిని, హుజురాబాద్ ఎంపీడీవో తూర్పాటి సునీత అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ… హుజురాబాద్ మండలంలో ఉన్న మొత్తం 20 గ్రామాలలో ఎన్నికలు నిర్వహణ కోసం 196 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హుజురాబాద్ మండలంలో 149 మంది సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేయగా ఉపసంహరణల అనంతరం 81 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని అన్నారు. మండలంలో మొత్తం 240 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఏపీవోలు 280 మంది, ఐదుగురు జోనల్ ఆఫీసర్లు, మొత్తం 20 గ్రామాలను 9 రూట్లుగా విభజించి ఒక్కొక్క రూట్ కు ఒక్కొక్క రూట్ ఆఫీసర్ ను నియమించినట్లు, 20 గ్రామాలలో 20 మంది రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు ఆమె తెలిపారు.






