
– జనవరి 11న లక్ష మందితో హనుమకొండలో రాష్ట్ర స్థాయి ఓసిల సింహగర్జన సమరభేరి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (జగిత్యాల): రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్న కుట్రలను సాగానివ్వబోమని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు ఓసి ఐకాస నాయకులు పిలుపు నిచ్చారు. జనవరి 11న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన ఓసిల సింహగర్జన సభకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం జగిత్యాల పట్టణ పద్మనాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జగిత్యాల జిల్లాస్థాయి సన్నాహక సమావేశంలో ఓసి ఐకాస రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు చీటి శిరీష, జగిత్యాల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కొప్పెర వెంకట్ రెడ్డి, జగిత్యాల జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు ఐలినేని సాగర్ రావు, జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు పుల్లూరి సత్యనారాయణ, జిల్లా బ్రాహ్మణ సంఘాల అధ్యక్షుడు మోతె ఉమాపతిశర్మలు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్ల పై రాజకీయ పబ్బం కోసం కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసిలను పలుచన చేయాలనే కుయుక్తులను సాగనివ్వబోమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓసిలకు నేటికీ రాజకీయ రిజర్వేషన్లు లేక తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, మొన్నటి స్ధానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక అంగ బలం ముందు ఓసి అభ్యర్ధులు సరితూగ లేక జనరల్ స్థానాల్లో కనీసం 50శాతం సీట్లు కూడా గెలుచుకోలేక పోయారని పోలాడి రామారావు విచారం, ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాలతో ఓసిలకు నేటికీ తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ ఓసి జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు. అందుకే రాజకీయ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం ఓసిలకు కల్పించాలని రామారావు డిమాండ్ చేశారు.
ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని , ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు.
టెట్ అర్హత పరీక్ష మార్కులను ఈడబ్ల్యూస్ వర్గాలకు 90 నుంచి 70 మార్కులకు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కోరారు .తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందు కోసం జనవరి నెల 11న సాయంత్రం 3 గంటలకు హన్మకొండ లోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో లో లక్ష మందితో నిర్వహించతలపెట్టిన ఓసి ల సింహగర్జన భారీ బహిరంగ సభకు ఓసి వర్గీయులందరూ రాజకీయాల కతీతంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను సమావేశంలో ఐకాస నాయకులు ఆవిష్కరించారు. ఈ సమావేశం లో ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నం కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు చీటి శిరీష తో పాటు రెడ్డి సంఘాల ప్రతినిధులు కొప్పర వెంకట్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, బద్దం నారాయణ రెడ్డి, జిల్లా వెలమ సంఘం ప్రతినిధులు అయిలినేని సాగర్ రావు, వొద్దినేని పురుషోత్తం రావు, వెంకటేశ్వర్ రావు, చీటి సంతోష్ రావు ,ఐలినేనీ స్వప్న, వైశ్య సంఘం ప్రతినిధులు పుళ్ళూరి సత్యనారాయణ, మహంకాళి రాజన్న, బ్రాహ్మణ సంఘo ప్రతినిధులు మోతె ఉమాపతి శర్మ, రాజేందర్ శర్మ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ రావు , సిరిసిల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.


సమావేశాలు మాట్లాడుతున్న పోలాడి రామారావు..

బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఐకాస నాయకులు..






