
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఈ నెలలోనే 117 మున్సిపాలిటీ పాలకవర్గాలకు ఎన్నికల నిర్వహణకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సిద్ధం చేసింది. ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా గడువు ముగిసిన 117 మున్సిపాలిటీ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది తెలిసిందే. ఈ నెల 10న తుది జాబితా వెలువరిస్తుంది. దీంతో ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సంక్రాంతి పండగ, సెలవుల కారణంగా కుదరకపోతే 20న విడుదల చేస్తారనీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా, మిగతా ప్రక్రియ సజావుగా సాగేలా పురపాలక పట్టణాభివృద్ది శాఖ సిద్ధమవుతుంది అని తెలిసింది. ఏది ఏమైనప్పటికి ఎన్నికల బరిలో నిలిచే ఆశావాహులు ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకోగా, నోటిఫికేషన్ రావడమే తరువాయి అన్నట్టుగా ఎదురుచూస్తున్నారు.






