
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి శక్తి చాటి చెప్పి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను కైవసం చేసుకుని కాషాయ జెండా ఎగరవేయడానికి బిజెపి శ్రేణులంతా తగిన కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హుజురాబాద్, జమ్మికుంట బిజెపి ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గంగాడి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. .మున్సిపాలిటీ ఎన్నికల కోసం చేపట్టాల్సిన కార్యచరణ పై, అనుసరించాల్సిన విధానాలపై పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసి మాట్లాడారు. గత బిఆర్ఎస్, నేటి కాంగ్రెస్ సర్కార్ లు మున్సిపాలిటీల అభివృద్ధిపై తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించాయన్నారు. రోజురోజుకి మున్సిపాలిటీల పరిధి విస్తరిస్తున్న సరైన మౌలిక కల్పించలేని పరిస్థితులలో దుర్భర స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన మున్సిపాలిటీల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని, ఇప్పటివరకు ఒక్క రూపాయి అభివృద్ధి పనులు చేపట్టిన దాఖలాలు లేవని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. నాడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిందని, నేడు కూడా అడ్డదారుల్లో అధికారం పొందడానికి అనేక ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. పట్టణ ఓటర్లు కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ ఎంతో కృషి చేస్తుందన్నారు. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఆశీర్వదించి అవకాశం కల్పిస్తే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సహాయ సహకారాలతో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి, పట్టణ ముఖచిత్రాన్ని మార్చడానికి తగిన కృషి చేస్తామన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేనప్పుడు, నేడు అధికారంలో లేనప్పుడు ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ కు ఓటు వేయడం దండగ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, హుజురాబాద్, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు, కొలగాని రాజు, కమలాపూర్, ఇల్లంతకుంట, సైదాపూర్ మండలాల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, రమణారెడ్డి, దేంచనాల శ్రీనివాస్, హుజురాబాద్ మండల ప్రధాన కార్యదర్శి మోడపు వినయ్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి..






