
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ను ప్రత్యేక పీవీ జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ మరోసారి ఉవ్వెత్తున ఎగసిపడింది. శనివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ‘హుజురాబాద్ పీవీ జిల్లా సాధన సమితి’ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టగా అన్ని పార్టీలు, అన్ని వర్గాల మద్దతు లభించింది. ఈ సందర్భంగా పట్టణంలోని నాయకులు హుజురాబాద్ పీవీ జిల్లా కావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీక్షను ఉద్దేశించి జిల్లా సాధన సమితి కన్వీనర్
బిమోజు సదానందం మాట్లాడుతూ.. హుజురాబాద్ జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని భౌగోళిక, పరిపాలనా సౌలభ్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. “గత ప్రభుత్వం రాజకీయ కారణాలతో హుజురాబాద్ కంటే చిన్న ప్రాంతాలను కూడా జిల్లాలుగా మార్చింది, కానీ ఈ ప్రాంతాన్ని మాత్రం విస్మరించింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

13 మండలాలతో కొత్త జిల్లా..హుజురాబాద్ కేంద్రంగా శంకరపట్నం, సైదాపూర్, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్, ఎల్కతుర్తి, వేలేరు, భీమదేవరపల్లి, టేకుమట్ల, మొగుల్లపల్లి, చిట్యాల మండలాలను కలుపుతూ జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం చల్లూరు, వావిలాల, ఉప్పల్ గ్రామాలను తక్షణమే కొత్త మండలాలుగా ప్రకటించాలన్నారు. జమ్మికుంట మరియు ఎల్కతుర్తి ప్రాంతాలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా మార్చాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో 5 లక్షలకు పైగా జనాభా ఉందని, ప్రజల సౌకర్యార్థం జిల్లా ఏర్పాటు అనివార్యమని పేర్కొన్నారు. ఈ దీక్షా కార్యక్రమంలో కళాకారులు రామ్ రాజేశ్వర్, భరత్ ఆలపించిన ఉద్యమ గీతాలు అటు సభికులను, ఇటు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా ఏర్పాటు వరకు విశ్రమించేది లేదని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, పొడిశెట్టి వెంకటరాజం, బండ శ్రీనివాస్, వేల్పుల రత్నం, వేల్పుల ప్రభాకర్, రవీందర్ రావు, ప్రభాకర్ రావు, జగన్నాథం, సాదుల రవీందర్ బాబు, మాడుగుల ఓదేలు, పంజాల రవీందర్ గౌడ్, మోటం రామ్ కుమార్, సందెల వెంకన్న, ఖాలీద్ హుస్సేన్, బండ అశోక్, ధనవర్ష రాజు, మార్తా రవీందర్, పసులు స్వామి, ఫయాజ్, అకినపల్లి శిరీష, మారపల్లి సుశీల, జేఏసీ నాయకులతో పాటు హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు , సీనియర్ జర్నలిస్ట్ లు మండల యాదగిరి, పరంకుశం కిరణ్ కుమార్, చిలకమారి సత్యరాజ్, ఇప్పకాయల సాగర్ తదితరులు పాల్గొన్నారు.





జేఏసీ నాయకుల ఒక రోజు నిరాహార దీక్ష దృశ్యాలు..





