
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజురాబాద్ జనవరి 29: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలో భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతరలో కీలక ఘట్టమైన మొదటి దశలో బుధవారం రోజున భక్తిశ్రద్ధల నడుమ పట్టణంలోని తెనుగువాడ నుండి సారలమ్మను గద్దెలపైకి చేర్చారు. అనంతరం గురువారం రాత్రి పెద్దపాపయ్యపల్లి గ్రామం నుంచి సమ్మక్కను కోయ పూజారులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా రంగనాయకులగుట్ట వద్దకు తీసుకొచ్చారు.ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు జోరుగా సాగగా, భక్తుల నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. గద్దెపైకి సమ్మక్కను ప్రతిష్ఠించే ముందు కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకులగుట్ట వద్ద ఏర్పాటు చేసిన గద్దెలపై సమ్మక్కను కొలువుదీర్చడంతో జాతర ఘట్టం అధికారికంగా ప్రారంభమైంది. అమ్మ వారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. కుంకుమ, పసుపు, బెల్లం (బంగారం) తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకుంటూ భక్తితో ఆ తల్లులను పూజిస్తున్నారు. జాతర ప్రారంభంతో హుజూరాబాద్ పరిసర ప్రాంతాలు భక్తుల కోలాహలంతో జాతర ఏరియా మొత్తం నిండిపోయాయి. అయితే ధర్మ దర్శనానికి సైతం పేద భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడం, విచ్చల విడిగా అధిక ధరలకు మద్యం విక్రయించడం, దానికి కమిటీ నేతలే వత్తాసు పలకడం తీవ్ర విమర్శలకు ధర తీస్తుంది. రేపు శుక్రవారం వేలాది మంది భక్తులు రానుండగా వారికి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయలేదని పలువురు విమర్శిస్తున్నారు.







సమ్మక్క తల్లిని గద్దెకు తరలిస్తున్న కోయ పూజారుల దృశ్యాలు…

ధర్మ దర్శనానికి సైతం పేద భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడం పట్ల పలువురి ఆగ్రహం..





