
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా. ఇచ్చిన హామీల మేరకు అన్నదాతల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో ఈనెల 28న రెండు లక్షల మందితో రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమరభేరి సభను పార్టీల కతీతంగా రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. శుక్రవారం హుజురాబాద్ లో హుజురాబాద్, హుస్నాబాద్ డివిజన్ రైస్ మిల్లర్స్, సీడ్ కంపెనీల అసోసియేషన్ నాయకుల, జిల్లా ఆర్య వైశ్య సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఈనెల 28న నిర్వహించే రైతు మహా గర్జన సమరభేరి సభ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రైతు మహాగర్జన సమరభేరి సభ గోడ ప్రతులను నాయకులు ఆవిష్కరించారు.


స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రైతు మహాగర్జన సమరభేరి సభ గోడ ప్రతులను ఆవిష్కరిస్తున్న నాయకులు

పోలాడి రామారావు మాట్లాడుతూ..
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య వైఖరి విడనాడి వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
రెండు లక్షల ఋణ మాఫీలో 30 శాతం మందికే చేసిన ప్రభుత్వం అర్హులైన మిగతా 70 శాతం రైతులకు రుణమాఫీ ఎందుకు పూర్తి చేయడం లేదని రామారావు ప్రశ్నించారు. అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని ఎందుకు కొంతమేరకు సన్న రకాలకు ఇస్తున్నారు? ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు నిలిచి పోయింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ ? అని పోలాడి ప్రశ్నించారు. ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్ పంటల సాగు సమయంలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నామ మాత్రంగానే ఓసి కార్పొరేషన్లను ప్రకటించిన ప్రభుత్వం వాటికి పాలక మండలి ఏర్పాటు చేయకుండా చట్ట బద్ధత కల్పించక నిదులు ఎందుకు కేటాయించ లేదు.?
గతంలో ఉన్న పాల ఉత్పత్తి దారులకు లీటరుకు రూ 4రూపాయల రాయితీ ఎందుకు నిలిపి వేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులను నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ సీడ్ కంపెనీల యాజమానుల ఆగడాలను ఎందుకు అరి కట్టడం లేదు. ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని యువతకు ఉద్యోగావకాశాలు ఎప్పుడు కల్పిస్తారు అని రామారావు ప్రశ్నించారు. 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రైతుల భీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలనే తదితర డిమాండ్లతో ఈ నెల 28న కరీంనగర్ లో రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండు లక్షల మందితో రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభను పార్టీల కతీతంగా చారిత్రాత్మకంగా నిర్వహిస్తామని పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కదలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ప్రజాసంఘాల జేఏసీ ప్రథాన కార్యదర్శి ఎడవెల్లి కొండాల్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఆర్య వైశ్య సంఘాల నాయకుడు తాటిపల్లి రాజన్న, హుజురాబాద్ డివిజన్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కల్లెపు మోహన్ రావు,
సీడ్ కంపెనీల అధ్యక్షుడు ఐరేని భాస్కర్ రెడ్డి, నాయకులు పుల్లూరి ప్రభాకర్ రావు, పలకల ఈశ్వర్ రెడ్డి, గర్రెపల్లి రాజమొగిలి, హరిశంకర్, జైపాల్ రెడ్డి, వేల్పుల రత్నం, రాజేశ్వర్ రావు, సంపత్ రావు, తదితర రైతు ప్రజాసంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.






