
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజల ఆరోగ్యానికి నష్టం అయ్యే, పర్యావరణానికి ఇబ్బంది కలిగే డంపింగ్ యార్డ్ రద్దు అయ్యే వరకు ప్రజల సహకారంతో జరిగే పోరాటం ఆగదని పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న 26వ రోజు నిరసన దీక్షలో భాగంగా రైస్ మిల్లర్స్, సీడ్ మిల్స్ అసోసియేషన్ పాలకవర్గం నిరసన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా సీడ్ మిల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పుల్లూరి ప్రభాకర్ రావు మాట్లాడుతూ… డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతం నష్టపోతుందని అన్నారు. కరీంనగర్ వరంగల్ జిల్లా కేంద్రాల నుండి చెత్తను హుజురాబాద్ కు పంపడం చాలా దారుణం అని అన్నారు. రోజుకు 8 టన్నుల చెత్త హుజురాబాద్ లో వేయడం వల్ల హుజురాబాద్ ప్రాంత పరిసరాలన్నీ పూర్తిగా కలుషితమవుతాయని ఈ ప్రాంతంలో నివసించడం కష్టమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డ్ ఏర్పాటును రద్దు చేయాలన్నారు.

అనంతరం ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయం వరకు వెళ్లి వినతి పత్రం అందజేశారు. కాగా ఈ దీక్షా శిబిరానికి మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు పలువురు కాంగ్రెస్ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్, సీడ్ మిల్స్ అసోసియేషన్ నాయకులు కళ్లెపు మోహన్ రావు, ఐ భాస్కర్ రెడ్డి, క్యాస ఉపేందర్, సంపత్ రావు, ఎర్రం రాజన్న, కే శ్రీనివాస్, సముదర్ రావు, వీరభద్రారావు, క్యాస నారాయణ, శ్రీనివాస్, శ్రీకాంత్, సురేందర్రావు, అఖిలపక్ష నాయకులు ఈశ్వర్ రెడ్డి, రత్నం, ఎడవల్లి కొండల్ రెడ్డి, గుడిపాటి జైపాల్ రెడ్డి, వెంకట్రావు, రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు, పోల్సాని రామారావు, చందుపట్ల జనార్ధన్, రాజేశ్వరరావు, సమ్మయ్య లక్ష్మణమూర్తి, ఎల్లయ్య, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.






