
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంతాన్ని చెత్త మైదానంగా మార్చే కుట్రను వెంటనే నిలిపివేయాలని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఈ డంపింగ్ యార్డు ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయకపోతే తీవ్ర స్థాయిలో ప్రజా ఉద్యమం చేపట్టి, అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్లడానికి వెనుకాడమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని బీసీ ఆజాది ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
జనావాసాల మధ్యలో, పచ్చని పంట పొలాల మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేసే నిర్ణయమని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విద్యుత్ ఉత్పత్తి పేరుతో ప్రజలపై విష రసాయనాలను మోపే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని జక్కని హెచ్చరించారు.
ఇలాంటి ప్లాంట్లను ప్రజలు నివసించని దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి గాని, హుజురాబాద్ను లక్ష్యంగా ఎంచుకోవడం వెనుక స్పష్టమైన రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. హుజురాబాద్ ప్రజలు ఓట్ల కోసం మాత్రమే గుర్తు చేసుకునే ప్రజలు కారని, వారి ప్రాణాలకు విలువ లేదని భావించడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో హుజురాబాద్ ప్రజలు చేసిన త్యాగాలను మరిచిపోవడం ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద అన్యాయం అని విమర్శించారు. వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే రోడ్లపై భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. హుజురాబాద్ను చెత్త కుప్పగా మార్చే కుట్ర ఆపాలని అన్నారు.
హుజురాబాద్ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ డంపింగ్ యార్డు పేరుతో విషాన్ని మోపే ప్రభుత్వ ప్రయత్నాన్ని బీసీ ఆజాది ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.
ఇది అభివృద్ధి కాదు — ఇది నాశనంమన్నారు. ఇది ప్రాజెక్ట్ కాదు — ఇది ప్రజలపై విష దాడి అన్నారు.
జనావాసాల మధ్యలో, పచ్చని పంట పొలాల మధ్యలో డంపింగ్ యార్డు పెట్టడం అంటే ప్రజల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును తాకట్టు పెట్టడమే అని పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రజలు ప్రయోగాల కోసం ఉన్నవారు కారే! విద్యుత్ ఉత్పత్తి పేరుతో విష వాయువులు, ప్రమాదకర రసాయనాలు విడుదల చేసే ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేయడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశం ఉందన్నారు.
హుజురాబాద్పై ఈ అన్యాయం ఎందుకు?
ఇక్కడి ప్రజల ప్రాణాలకు విలువ లేదా?
ఇది మేము సహించం అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం అన్నారు. డంపింగ్ యార్డు ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలనీ, లేకపోతే భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం చేస్తామని, రోడ్లపై నిరసనలు ప్రభుత్వంపై పూర్తి స్థాయి పోరాటం మరియు అవసరమైతే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్లి ఈ ప్రాజెక్ట్ను ఆపేస్తాం! అని సంజయ్ చెప్పారు. హుజురాబాద్ ప్రజలు మౌనంగా ఉండరనీ, ప్రజల ఆరోగ్యం మీద రాజకీయం చేస్తే క్షమించం అని, ఇది హెచ్చరిక కాదు — ఇది పోరాటానికి నాంది యని అన్నారు. హుజురాబాద్ను చెత్త కుప్పగా మార్చే కుట్ర ఆపాలి! అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, హుజురాబాద్ మండల అధ్యక్షుడు నడిగోటి రమేష్, ప్రధాన కార్యదర్శి మమునూరి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు కొలిపాక క్రాంతికుమార్, ప్రచార కార్యదర్శి పంజాల వెంకటేశ్వర్లుగౌడ్, కందుకూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.





